వినోదాన్ని పంచిన సినిమా థియేటర్లకు గడ్డు రోజులు వచ్చాయి. ప్రేక్షకులు రాక నేడు వెలవెలబోతున్నాయి. తమ అభిమాన హీరోల సినిమాలు వస్తే టాకీస్లు జనసంద్రమయ్యేవి. తెరపై అభిమాన నటీనటులను చూసి ఈలలు వేసి, కేరింతలు కొట్టేవారు. బాక్సాఫీసులు కలెక్షన్లతో బద్దలయ్యేవి. ఇదంతా ఆ పాత మధురం. కరోనా-లాక్డౌన్ తర్వాత సినిమా టాకీస్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.లాక్డౌన్తో నెలల పాటు ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. థియేటర్లు సైతం మూసివేశారు. ఆ టైంలో ఓటీటీల రూపంలో ఇంట్లోనే వినోదం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రజలు దానికి అలావాటు పడడంతో లాక్డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నా గతంలో మాదిరిగా ప్రేక్షకులు వెళ్లడం లేదు. ఓటీటీనే కాకుండా టికెట్ రేట్ల ధరల పెంపు కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా చేసిందని చెప్పవచ్చు.
సదాశివపేట, ఆగస్టు 6: కరోనా-లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అరచేతిలో ఇంటర్నెట్ విప్లవం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ అందుబాటులో ఉండడంతో ఇంట్లోనే వినోదం లభ్యమైంది. ఈ సమయంలో ఓటీటీకి ఆదరణ చాలా పెరిగింది. ఓటీటీ ప్లాట్ ఫాంలో వచ్చే వెబ్ సిరీస్లు, సీరియల్స్, సినిమాలకు జనం అలవాటుపడ్డారు. లాక్డౌన్ సమయంలో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉండడంతో పాటు కరోనా సమయంలో బయటకు వెళ్లకపోవడంతో ఓటీటీకి ఆదరణ పెరిగింది. దీంతో థియేటర్లకు ఆదరణ తగ్గడం ప్రారంభమైంది.
పెరిగిన ధరలతో అనాసక్తి..
కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు వినోద రంగం సైతం తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నది. కొవిడ్-19 నిబంధనల కారణంగా నిర్మాతలు చిత్రాలను నిర్మించలేకపోయారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సినీరంగంపై ఆధారపడ్డ వేలాది మంది ఉపాధి కోల్పోయారు. దీంతో థియేటర్ల మూసివేత అనివార్యమైంది. సినిమా టికెట్ల ధరలు పెంచాలని నిర్మాతల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్లో జీవో 21 విడుదల చేస్తూ టికెట్ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనిష్ట ధర రూ. 30, గరిష్ట ధర రూ. 70గా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ. 50, గరిష్ట ధర రూ. 150కి పెంచారు. జీఎస్టీ కూడా వర్తిస్తుంది. వీటితో పాటు నిర్వహణ చార్జీల కింద నాన్ ఏసీ థియేటర్లు రూ. 3, ఏసీ థియేటర్లు రూ. 5 వసూలు చేసేందుకు అనుమతించింది. ఇంతే కాకుండా కూల్డ్రింక్స్, తినుబండారాలు, స్నాక్స్ రేట్లు అధికంగా ఉండడంతో థియేటర్లలో సినిమాలకు వెళ్తే తడిసి మోపెడవుతున్నది. దీంతో ప్రేక్షక్షులు థియేటర్లకు పోవడానికి ఇష్టపడడం లేదు. ఈ సమయంలో వారికి ఓటీటీ ప్లాట్ఫాం ఇంట్లోనే వినోదాన్ని పంచుతున్నది. దేశవిదేశీ సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఇంట్లో నుంచే చూసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫాంలలో సబ్స్క్రిప్షన్ల ధరలు అందుబాటులో ఉండడంతో ప్రేక్షక్షులు థియేటర్ల వైపు మొగ్గు చూపడం లేదు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ 5, సన్ నెక్ట్స్, వూట్, సోనీ లైవ్, డిస్నీ స్టార్, హాట్స్టార్, వియూ వీడియో కంటెంట్ ప్లాట్ఫాంలు ఉన్నాయి. ఏడాది, నెలవారి చందాలతో ప్రేక్షకులు సేవలు పొందుతూ ఇంట్లోనే వినోదాన్ని పొందుతున్నారు.
పైరసీ భూతం కారణమే..
కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న సినిమాలకు పైరసీ భూతం భారీ నష్టాన్ని మిగులుతున్నది. కొందరు అక్రమార్కులు పైరసీకి పాల్పడుతుండంతో సినిమాలు థియేటర్లకు రాకుండానే లీక్ అవుతున్నాయి. సినిమా విడుదల కాకముందే పలు థర్డ్ పార్టీ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతుండడంతో అభిమానులు థియేటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా పోతున్నంది. పైరసీ కూడా పరోక్షంగా థియేటర్లకు భారీ నష్టాన్నే మిగుల్చుతున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో థియేటర్ల వివరాలు…
సదాశివపేటలో రెండు, జహీరాబాద్లో మూడు, సంగారెడ్డిలో మూడు, నారాయణఖేడ్లో రెండు, పటాన్చెరులో ఒక సినిమా థియేటర్ ప్రస్తుతం నడుస్తున్నాయి. గజ్వేల్లో మూడు, సిద్దిపేటలో నాలుగు, చేర్యాలలో రెండు, హుస్నాబాద్లో రెండు, మెదక్లో మూడు, నర్సాపూర్లో రెండు, పెద్దశంకరంపేట్, తూప్రాన్లో ఒక థియేటర్ ఉన్నాయి.
ఉపాధి కోల్పోతున్న కార్మికులు
థియేటర్లపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా థియేటర్లపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు వేరే ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూసివేయడంతో పోస్టర్ బాయ్, పార్కింగ్బాయ్, టికెటింగ్ ఎగ్జిక్యూటీవ్, ప్రొజెక్టర్ ఆపరేటర్ వంటి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం థియేటర్లు ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల రాక యాజమాన్యాలు సిబ్బందిని తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి. దీంతో కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు.
టికెట్ల ధరలు పెరిగాయి..
గతంలో ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు వెళ్లే వాళ్లం. కరోనాతో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేకపోయాం. ఇంట్లోనే ఓటీటీ ఫ్లాట్ఫాంలో వచ్చే సినిమాలు చూశాం. టికెట్ ధరలు పెరగడంతో ప్రస్తుతం సినిమా థియేటర్లకు వెళ్లడం లేదు. ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నాం. నెలకోసారి మాత్రమే ఫెండ్స్తో కలిసి సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నాం.
– కృష్ణ, సదాశివపేట