బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వన్టైం సెటిల్మెంట్(ఓటీఎస్) సువర్ణావకాశమని, దీనిని రైతులు వినియోగించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో బ్యాంకర్లతో పాటు జాతీయ రహదారి నిర్మాణ పనులు, రైల్వే పనులపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులను రుణ విముక్తులను చేసేలా కార్యాచరణ రూపొందించాలని బ్యాంకర్లను కోరారు. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఏపీజీవీబీ, టీజీబీ బ్యాంకుల నుంచి వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణ పనులు, జనగామ- సిరిసిల్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్లు ముజామ్మిల్ ఖాన్, శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట, నవంబర్ 22 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): “సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, సాగు నీరు, రైతు బంధుతో పాటు కొత్తగా బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు అందించారు. బ్యాంక్ రుణాలు తీసుకొని బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు రుణవిముక్తి అయ్యేలా వన్టైమ్ సెటిల్మెంట్ సువర్ణావకాశమని, ఇట్టి అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని” అని ఆర్థిక,వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో బ్యాంకు బకాయిలు రుణవిముక్తి కోసం వన్ టైం సెటిల్మెంట్ అంశంపై మంత్రి హరీశ్రావు చర్చించారు. ఈ సమీక్షకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డి, బ్యాంక్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రైతుల వ్యవసాయ రుణాలను అన్ని బ్యాంకులు రెన్యూవల్ చేయాలని చెప్పారు.
ముంపునకు గురైన రైతుల భూములకు సంబంధించి వారి రుణాల విషయంలో బ్యాంకులు ప్రత్యేక పథకాలు రూపొందించి, వారిని రుణ విముక్తులను చేసేలా కార్యాచరణ రూపొందించాలని బ్యాంకర్లను కోరారు. జిల్లా వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ, టీజీబీల్లోని రైతులకు రుణ విముక్తి కలుగనున్నదని చెప్పారు.వివిధ బ్యాంకుల నుంచి ఓటీఎస్ స్కీమ్ కింద 12 శాతం నుంచి 50 శాతం వరకు మొండి బకాయిలు ఉండి, క్రాప్ లోన్ తీసుకొని తిరిగి కట్టలేక పోయిన వారికి ఈ నాలుగు బ్యాంకుల నుంచి వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, ఇందు కోసం బ్యాం కర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఏఈవో లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, క్షేత్రస్థాయి అధికారులు రైతులకు మేలు కలిగేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు. గతంలో ఫిషరీస్ కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారివి తొందరగా గ్రౌండింగ్ చేయాలని మంత్రి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యజిత్, ఆర్బీఐ ఏజీఎం శివరామన్, నాబార్డు డీడీఎం తెజన్, యూనియన్ బ్యాంకు డీజీఎం సత్యం, ఏపీజీబీబీ ఆర్ఎం ఆశలత, కెనరా బ్యాంక్ అధికారి మాధవి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీజీవీబీ బ్రాంచులను పునరుద్ధరించండి
గజ్వేల్ మండలం అహ్మదీపూర్, జగదేవ్పూర్ మండలం తీగుల్ బ్రాంచులను పునరుద్ధరించాలని ఏపీజీవీబీ ఆర్ఎం ఆశలతను మంత్రి ఆదేశించారు. మావోయిస్టుల ప్రాబల్యంతో గతంలో ఇక్కడి బ్రాంచులను గజ్వేల్-ప్రజ్ఞాపూర్కు తరలించారని, ఈ గ్రామాల్లో 5వేల జనాభా ఉందని గతంలో మంత్రి దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఏపీజీవీబీ బ్యాంక్ బ్రాంచులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.