అందోల్, ఫిబ్రవరి 2 : గూడులేని నిరుపేదలకు గూడును అందించి వారు గౌరవంగా బతుకాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. గురువారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో డాకూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను లబ్ధ్దిదారులకు అందజేశారు. అర్హులను ఎంపిక చేసి ఇండ్లను అందజేస్తున్నామని తెలిపారు. డాకూర్లో 104 ఇండ్లను నిర్మించగా, అర్హులను ఎంపిక చేసి లాటరీ పద్ధ్దతిలో ఇండ్లు కేటాయించామన్నారు.
పార్టీలకు అతీతంగా అర్హులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారని చెప్పారు. 104 మంది లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేసి పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవాలు నిర్వహించుకుందామని భావిస్తే కాంగ్రెస్ నాయకులు దీన్ని రాజకీయం చేసి పేదలకు అన్యాయం చేసేందుకు యత్నించి కోర్టుకు వెళ్లారన్నారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు 10 డబుల్ ఇండ్లను రిజర్వ్లో పెట్టి 94 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషిచేస్తున్నదని, దీన్ని గుర్తించి ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలే తప్ప…అడ్డుపడకూడదని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, తాలెల్మ సర్పంచ్ లింగాగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్రెడ్డి, మాజీ సర్పంచ్లు శంకరయ్య, శ్రీనివాస్, నాయకులు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.