వెల్దుర్తి, డిసెంబర్ 3: గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాల పాలైన ఘటన మండలంలోని మాసాయిపేట గ్రామశివారు 44వ జాతీయ రహదారి, చెట్ట తిమ్మాయిపల్లి క్రాస్రోడ్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. చేగుంట ఎస్సై ప్రకాశ్గౌడ్ కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల దండుపల్లికి చెందిన కుటుంబాల వారు ఏడుపాయల్లోని వనదుర్గా భవానీ దేవాలయంలో శుక్రవారం శుభకార్యం చేసుకున్నారు.
శనివారం తెల్లవారుజామున టాటాఏస్లో తమ స్వగ్రామాలకు తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారి మాసాయిపేట శివారులో వెనుక నుంచి వేగం గా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి రోడ్డు కిందకు పల్టీకొట్టింది. ఆటోలో ఉన్న నాచారం గ్రామానికి చెందిన సురేశ్(30)కు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలోని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. సురేశ్ మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానలో ఉంచారు. మృతుడి సోదరుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రకాశ్గౌడ్ తెలిపారు.