మెదక్ రూరల్, ఏప్రిల్ 23: గరుడగంగ మంజీరా పుష్కరాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఆదివారం మెదక్ మండల పరిధి పేరూరు సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో వేకువజాము నుంచే వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. సరస్వతీ మాత ఆలయ వ్యవస్థాపకుడు బ్రహ్మ శ్రీ దోర్బల రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో గుణకార్ శర్మ మహేశ్ శర్మ, సరస్వతి మాతను ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా పుష్కర దేవతకు 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. కైలాస పర్వతంపై 20అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన మంజునాథుడి విగ్రహం విశేషంగా ఆకట్టుకున్నది.
భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి నాగుల విభూతిని ధరించి సరస్వతి మాత, నాగదేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాకుడు బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళి శర్మ మాట్లాడుతూ పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోవడమే కాకుండా పితృ దేవతలకు శాంతి చేకూరుతుందన్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ పుష్కర స్నానంతో పునీతులు కావాలని కోరారు. పవిత్ర గంగ స్నానం చేసేటప్పుడు త్రికరణ శుద్ధితో ఉండి, ఆచారాలను భక్తితో నిర్వహించి, శుభ్రమైన వస్ర్తాలను ధరించాలన్నారు. స్నానం చేసేటప్పుడు తర్పణాలు వదలాలన్నారు.
3వతేదీ వరకు పుష్కరాలు
మంజీరా గరుడగంగ పుష్కరాలు మే 3వ తేదీ వరకు సాగనున్నాయి. స్నానాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, సహస్ర కలశాలతో మంజునాథుడికి అభిషేకం, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.