ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ తీసుకోవాలి. ఎలా నింపాలి. విధివిధానాలు ఏమిటి.. ఏయే పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి..? మరి ఇప్పుడొస్తున్న పథకాలకూ దరఖాస్తు చేయాలా.. కొత్త వాటికి చేయాలా? అన్నింటికీ కలిపి మళ్లీ దరఖాస్తు చేయాలా?.. పూర్తిచేసిన దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి.. సమాచారం ఎవరిస్తారు.. ఇలా అనేక సందేహాలతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. తొలిరోజు నిర్వహించిన ప్రజా పాలనలో ప్రజల సందేహాలు నివృత్తి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కార్యక్రమం నిర్వహించామా.. దరఖాస్తులు స్వీకరించామా.. అయిపోయిందా..? చేయి
దులుపుకొన్నామా అన్నట్లుగా వ్యవహరించారు.ప్రజలు ఏం అడుగుతున్నారు..? వారికి ఉన్న సందేహాలను ఎలా నివృత్తి చేద్దామనే కోణంలో అధికార యంత్రాంగం పనిచేయలేదని, ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
బొల్లారం, డిసెంబర్ 28: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని చైర్పర్సన్ రోజాబాల్రెడ్డి, కమిషనర్ సంగారెడ్డితో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా 1 వార్డులో 454, 12వ వార్డులో 211, 19వ వార్డులో 252 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భం గా చైర్పర్సన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రతిఒకరికీ చేరేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం కమిషనర్ సంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ఆయా కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పురుషులకు, మహిళలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా మొదటి రోజు మూడువార్డుల్లో కలిపి దాదాపు 917 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం అందించే దరఖాస్తు పత్రాలను మాత్రమే పూరించి దరఖాస్తులు సమర్పించాలని బొల్లారం మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు. జిరాక్స్ షాపుల నుంచి తీసుకువచ్చే పత్రాలను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించమని చెప్పారు. వివరాలతో పూరించిన దరఖాస్తు పత్రాలతోపాటు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్లను విధిగా జతచేయాలని సూచించారు. అధికారులు లేని కౌంటర్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌం టర్లు ఏర్పాటు చేశారు. మండలంలోని చెరాగ్పల్లిలో ఏర్పా టు చేసిన కౌంటర్లో నంబర్ 8ని ఏర్పాటు చేసి అక్కడ దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులను నియమించలేదు. దీంతో కౌంటర్ ఖాళీగా ఉండడంతో ప్రజలు దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలియక ఆందోళనకు గురయ్యారు.
కొండాపూర్, డిసెంబర్ 28 : కొండాపూర్ మండలంలో గురువారం గిర్మాపూర్, గారకూర్తి, మల్లేపల్లి, సీహెచ్ గోప్లారం గ్రామల్లో నిర్వహించిన ప్రజాపాలనకు 300 దరఖాస్తులు వచ్చాయని కొండాపూర్ ఎంపీడీవో మధులత తెలిపారు. ప్రభుత్వం నూతనంగా అందించనున్న ఆరు గ్యారెంటీల్లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
సదాశివపేట, డిసెంబర్ 28 : ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీలకు గురువారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పట్టణంలోని 1వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మునిపల్లి, డిసెంబర్ 28: ప్రజాపాలన సభను ప్రతిఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ తెలిపారు. గురువారం మండలంలోని చీలపల్లి, కల్లపల్లి-బేలూర్, మక్తక్యాసారం, గార్లపల్లి గ్రామాల్లో సభలను నిర్వహించారు.
కోహీర్, డిసెంబర్ 28: మండలంలోని కొత్తూర్(డి), చింతల్ఘాట్, గురుజువాడ, రాజనెల్లి గ్రామాల్లో గురువారం ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు ఆరు పథకాల కోసం నింపిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందించి రశీదులను పొందారు.
గుమ్మడిదల, డిసెంబర్ 28: ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని జడ్పీటీసీ కుమార్గౌడ్, తహసీల్దార్ గంగాభవానీ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో దయాకర్రావు ప్రారంభించారు. మం డలంలోని కొత్తపల్లి, నల్లవల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నారాయణఖేడ్, డిసెంబర్ 28: అర్హులకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రజాపాలన ప్రక్రియ కొనసాగించాలని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పంచగామ, సంజీవ్న్రావుపేట్ గ్రామాలతోపాటు నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. దరఖాస్తులో జరిగిన లోపాలకారణంగా అర్హులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం వెంటనే గ్రామాలకు వచ్చి దరఖాస్తులను సమర్పించాలన్నారు.
రామచంద్రాపురం, డిసెంబర్ 28: ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి అధికారులు గురువారం దరఖాస్తుల స్వీకరించారు. భారతీనగర్లో కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి, ఆర్సీపురంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, తెల్లాపూర్లో చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి ప్రజాపాలన కేంద్రాలను ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో అధికారులు ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొదటిరోజు తెల్లాపూర్లోని 1,2వ వార్డుల్లో మొత్తం 376 దరఖాస్తులు రాగా, భారతీనగర్లో 796, ఆర్సీపురంలో1,311దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
హత్నూర, డిసెంబర్ 28: మండలంలో దౌల్తాబాద్, లిం గాపూర్, గుండ్లమాచునూర్ గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. రేషన్కార్డులు కలిగిన కుటుంబాలు దరఖాస్తులను అధికారులకు సమర్పించగా, రేషన్కార్డుల్లేని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తాము ఎలా దరఖాస్తు చేసుకోవాలని అధికారులను అడగడంతో ప్రస్తుతం రేషన్కార్డు కలిగిన కుటుంబాల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని రేషన్కార్డులు లేనివారు నూతనంగా రేషన్కార్డు కోసం తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో రేషన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
అమీన్పూర్, డిసెంబర్ 28: ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలో ఆయన ప్రజాపాలన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయనున్న 6 గ్యారెంటీలను ప్రజాపాలనలో భాగంగా అందిస్తున్నామని చెప్పారు.
ఝరాసంగంతోపాటు కుప్పానగర్, కక్కర్వాడ గ్రామా ల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల నుంచి తహసీల్దార్ సంజీవరావు దరఖాస్తులను స్వీకరించారు. ఎంపీపీ దేవదాసు, సర్పంచ్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.
జహీరాబాద్, డిసెంబర్ 28: ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నది. గురువారం మొగుడంపల్లి మండలంలోని జాడిమాల్కపూర్లో నిర్వహించిన ప్రజాపాలన కాంగ్రెస్ సభగా మారిందని పలువురు ఆరోపించారు. సభ వేదికపై మండల పరిషత్ అధ్యక్షురాలు ప్రియాంక, ఎంపీడీవో మహేశ్ ఉండగా వారితోపాటు కాంగ్రెస్ నాయకులు గుండారెడ్డి, మక్సూద్ అహ్మద్ ఉండి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ వేదికపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండవల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులు ఉండి సభ నడిపించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిన్నారం, డిసెంబర్ 28: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యా రెంటీల దరఖాస్తుల స్వీకరణను గురువారం అధికారులు ప్రారంభించారు. గడ్డపోతారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి సతీశ్రెడ్డి, ఎంపీపీ రవీందర్గౌడ్, సర్పంచ్ ప్రకాశ్చారి, ప్రజాప్రతినిధులులతో కలిసి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్త రేషన్కార్డులు ఇవ్వనప్పుడు కార్యక్రమం పెట్టడం వల్ల ప్రయోజనం లేదని గడ్డపోతారం గ్రామానికి చెందిన మాణిక్యం అన్నారు. దీనిపై మండల ఇన్చార్జి, డీఎల్పీవో సతీశ్రెడ్డి, ఎంపీడీవో రాములు స్పందించి దరఖాస్తులైతే చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఝరాసంగం, డిసెంబర్ 28: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడు తున్న ప్రజాపరిపాలన కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించ డం లేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని సిద్ధా పూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, ఈ విషయం లో అధికారులకు సరైన ఆదేశాలివ్వలని ప్రభుత్వన్ని కోరారు. ఈ ఆరు గ్యారెంటీలకు ముఖ్యమైనది రేషన్కార్డు, కార్డులేని కుటుంబాలు ఆరు గ్యారెంటీల పథకాలపై అయోమయానికి గురవుతున్నాయన్నారు.