ప్రతిరోజూ దుకాణాల్లో అధికారుల సోదాలు
గజ్వేల్, ములుగు డివిజన్లలో 20కి పైగా కంపెనీలు
182 మంది డీలర్ల ద్వారా విక్రయాలు..
ఇప్పటికే డీలర్లకు రెండుసార్లు నకిలీ విత్తనాలు అమ్మొద్దంటూ సమావేశాలు
నకిలీ విత్తనాల నిర్మూలనకు రాష్ట్రస్థాయి విజిలెన్స్,
టాస్క్ఫోర్స్ అధికారుల దాడులు
రైతులు గుర్తింపును చూసి కొనుగోలు చేయాలని అధికారుల సలహా
పత్తి విత్తనాలపై ప్రత్యేక గురి
నకిలీల బారి నుంచి రైతన్నను కాపాడేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. రైతన్న ఆలోచనను విత్తనదశలోనే చంపే కల్తీ, నకిలీ విత్తనాలను తయారు చేసేవారిని, అమ్మేవారిని ఇక ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైతుకు పంట పెట్టుబడి, ఉచిత విద్యుత్, సాగునీరు అందించి వ్యవసాయంపై భరోసా పెంచిన ప్రభుత్వం.. కల్తీ, నకిలీ విత్తనాలను తయారు చేసే కంపెనీలపై డేగ కన్ను వేసింది. ప్రభుత్వ ఆదేశాలతో గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్ మండలాల్లో ఉన్న విత్తన కంపెనీల్లో ఐదారు రోజులుగా రాష్ట్ర టాస్క్ఫోర్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. గజ్వేల్, ములుగు డివిజన్లలో 20కి పైగా కంపెనీల్లో విత్తనాలు తయారు చేస్తున్నారు. సోదాల్లో ఎలాంటి కల్తీ, నకిలీ విత్తనాలు లభించలేదు. గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే సమయంలో దుకాణాదారుని వద్ద రశీదులు తప్పనిసరి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
గజ్వేల్, మే 18 : రైతుకు పంట పెట్టుబడి ఇచ్చి, 24గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు ఇచ్చినా అక్కడక్కడా పంట పండక రైతులు నష్టపోతున్నారు. ఇందుకు కారణం గుర్తింపు లేని కంపెనీలతో పాటు మరి కొన్ని గుర్తింపు ఉన్న కంపెనీలో అత్యాశతో నకిలీ, కల్తీ, కాలం చెల్లిన విత్తనాలను రైతులకు విక్రయించడమేనని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఆరుగాలం కష్టించి పంట పండించాలనుకున్న రైతన్న ఆలోచనను విత్తనదశలోనే చంపే కల్తీ, నకిలీ విత్తనాలను తయారు చేసేవారిని, అమ్మేవారిని ఇక ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైతుకు పంట పెట్టుబడి, ఉచిత విద్యుత్, సాగునీళ్లు అందించి వ్యవసాయంపై రైతుకు భరోసా పెంచిన ప్రభుత్వం కల్తీ,నకిలీ విత్తనాలను అరికట్టడంలో రైతుకు రక్షణగా నిలిచింది. ఐదారేండ్లుగా విత్తన దుకాణాలు, కంపెనీలపై నిఘా పెట్టింది. ఏడాదికేడాది రెట్టింపుగా పకడ్బందీ చర్యలు చేపడుతూ కల్తీ, నకిలీ విత్తనాలను తయారు చేసే కంపెనీలపై డేగ కన్ను వేసింది. నకిలీ, కల్తీ విత్తనాలు పట్టుబడ్డ కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. ఆయా కంపెనీ లైసెన్సులను రద్దు చేస్తూ క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపింది. తెలంగాణలో రైతుకు వ్యవసాయానికి అన్ని వసతులు సమకూర్చి అండగా నిలబడడమే కాక, ఎవరి చేతుల్లోనూ మోసపోకుండా రక్షణగా ప్రభుత్వం, అధికారులు నిలుస్తున్నారు. గజ్వేల్, ములుగు డివిజన్లలో వానకాలంలో లక్షా 64వేల 470 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయనుండగా ఇందులో 50శాతం వరకు అంటే 82వేల 260ఎకరాల్లో ప్రధానంగా పత్తినే సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాది గజ్వేల్ డివిజన్లో 30,685 ఎకరాలు, ములుగు వ్యవసాయ డివిజన్లో 27,963 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వచ్చే వానకాలంలో గజ్వేల్ డివిజన్లో 39028 ఎకరాలు, ములుగు డివిజన్ పరిధిలో 43,232 ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. మిగతా విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, స్వీట్కార్న్, కూరగాయలు తదితర పంటలను రైతులు పండించనున్నారు.
కంపెనీలు, దుకాణాలపై విజిలెన్స్ ఆకస్మిక దాడులు
కల్తీ, నకిలీ విత్తనాలను అరికట్టడంలో భాగంగా అధికారులు రోజూ విత్తనాల దుకాణాలను సోదా చేస్తున్నారు. ములుగు, గజ్వేల్ డివిజన్లలో రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా, ఈ సోదాల్లో ఎలాంటి కల్తీ, నకిలీ విత్తనాలు లభించలేదు. గజ్వేల్, ములుగు డివిజన్లలో 20కి పైగా కంపెనీల్లో విత్తనాలు తయారు చేస్తుండగా, 10 కంపెనీల్లో మాత్రం పత్తి విత్తనాలను తయారు చేస్తుంటారు. మిగతా కంపెనీల్లో వరి, మక్క, జొన్న, కూరగాయలు, పండ్ల విత్తనాలు తయారు చేస్తుంటారు. గజ్వేల్ డివిజన్ పరిధిలో 13 వర కు కంపెనీలు విత్తనాలను తయారు చేస్తుండగా, ములు గు డివిజన్లో 13కంపెనీలుండగా, 3 కంపెనీల్లో మాత్ర మే పత్తి విత్తనాలు తయారు చేస్తుంటారు. గజ్వేల్ డివిజన్ పరిధిలో 118 విత్తన విక్రయ కేంద్రాలు నిర్వహిస్తుండగా, కేవలం గజ్వేల్ పట్టణంలోనే 80 దుకాణాలకు పైగా ఉన్నాయి. ములుగు డివిజన్లో 69మంది డీలర్లు విత్తనాలను విక్రయిస్తుంటారు.
ఒక్క గజ్వేల్ పట్టణంలోని ప్రతి ఏడాది లక్ష ప్యాకెట్లకు పైచిలుకు పత్తి విత్తనాల కొనుగోళ్లు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
రైతులు, వ్యాపారులకు అవగాహన కల్తీ, నకిలీ విత్తనాల నిర్మూలనలో భాగంగా రైతుల్లో అవగాహన పెంచడానికి ఆయా క్లస్టర్ రైతువేదికల్లో ప్రజాప్రతినిధులు, రైతులకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోకి గుర్తింపు లేని కంపెనీల ప్రతినిధులు వచ్చి విక్రయించే విత్తనాలను కొనుగోలు చేయొద్దని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే సమయంలో దుకాణాదారుని వద్ద రశీదులు తప్పనిసరి తీసుకోవాలని చెబుతున్నారు. వ్యాపారులకు కూడా గుర్తింపు లేని, కల్తీ, నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా జైలుపాలు అవుతారని, రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించిన వ్యాపారులు రైతుల నమ్మకాన్ని నిలుపుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎర్రవల్లి ఫంక్షన్ హాలులో విత్తన డీలర్ల సమావేశం కూడా నిర్వహించారు.
నాణ్యమైన విత్తనాలే కొనుగోలు చేయాలి
నమ్మకమైన డీలర్ల వద్ద నాణ్యమైన విత్తనాలను బాగా పరిశీలించి రైతులు కొనుగోలు చేయాలి. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించే కంపెనీలైనా, డీలర్లు అయినా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు ఎంతో విశ్వాసంతో డీలర్వ వద్దకు విత్తనాలు కొనుగోలు చేయడానికి వస్తారు. కాబట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి. గ్రామాల్లోకి వచ్చే విత్తన కంపెనీల ఏజెంట్ల చేతిలో మోసపోకుండా రైతులు జాగ్రత్త పడాలి. విత్తన ఎంపికను బాగా పరిశీలించి రైతులే చేసుకోవాలి.
– బాబునాయక్, ఏడీఏ, గజ్వేల్
ప్రతిరోజూ దుకాణాల్లో తనిఖీ చేస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీ, నకిలీ విత్తనాలను అరికట్టడంలో భాగంగా ములుగు డివిజన్లో పటిష్టంగా విధులు నిర్వర్తిస్తున్నాం. నాతో పాటు మండల వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులు అన్ని దుకాణాలను ప్రతి రోజూ పరిశీలిస్తున్నాం. రైతులు ఎవరూ కూడా నకిలీ, కల్తీ విత్తనాలు కొని మోసపోకుండా ఎప్పటికప్పుడు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. వ్యాపారులకు కూడా కఠినమైన ఆదేశాలిచ్చాం. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసే కంపెనీలైన, విక్రయించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు పంపుతాం.
– అనిల్, ఏడీఏ, ములుగు