కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. దీనికోసం వ్యాక్సిన్నేషన్ ప్రక్రియను వేగిరం చేసింది. ఇప్పుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో 18ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు వ్యాక్సిన్లు ఇవ్వడానికి కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసేలా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మెదక్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో 18ఏండ్లు నిండిన వారు 460 మంది ఉన్నట్టు తేల్చారు. జిల్లాలోని అన్ని కశాశాలల నుంచి వైద్యశాఖ సిబ్బంది సమాచారాన్ని సేకరించారు.
మెదక్ జిల్లాలో 12,310 మంది విద్యార్థులు..
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 12,310 మంది విద్యార్థినీ విద్యార్థులు మొదటి, రెండో సంవత్సరం చదువుతున్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 173 మంది విద్యార్థులు వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇంకా 287మంది 18ఏండ్లు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా, జిల్లాలోని అన్ని కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 525 మంది ఉండగా, ఇప్పటి వరకు 500 మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇంకా 25 మంది వ్యాక్సిన్ తీసుకోలేదు.
సంగారెడ్డిలో 1600 మంది విద్యార్థులు..
18ఏండ్లు నిండిన ఇంటర్ విద్యార్థులకు కరోనా వ్యాక్సినేషన్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 104 ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 1600 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 104 ఇంటర్ కళాశాలల్లో ప్రభుత్వ 20, ప్రైవేట్ 44, ప్రభుత్వ పరిధిలో 40 ఉన్నాయి. ఆయా చోట్ల చదువుతున్న విద్యార్థులకు త్వరలో వ్యాక్సిన్ వేయనున్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా విద్యార్థులు ఇంటికే పరిమితమై, ఆన్లైన్ విద్యను అభ్యసించారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇటీవలే కళాశాలలు తెరుచుకున్నాయి. కళాశాలల్లో చదివే 18ఏండ్లు నిండిన విద్యార్థులందరికీ వ్యాక్సిన్ అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సంబంధిత అధికారులు వెల్లడించారు. వ్యాక్సినేషన్కు సంబంధించి ఆయా కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లను చేయనున్నాయి.
సిద్దిపేటలో 1682 మంది విద్యార్థులు..
సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల్లో 18ఏండ్లు నిండిన విద్యార్థులు 1682 మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వ కాలేజీల్లో 493 మంది ఉండగా, వీరిలో మొదటి డోస్ను 406 మంది, రెండో డోస్ను 273 మంది వేసుకున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో 18ఏండ్లు నిండిన ఉన్న వారు 1102 మంది కాగా, వీరిలో 931 మంది మొదటి డోస్, 636 మంది రెండోడోస్ తీసుకున్నారు. గురుకులాలు, ఇతర కాలేజీల్లో 87 మంది ఉండగా, ఇందులో 60 మంది మొదటి డోస్, 30 మంది రెండోడోస్ వేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, వ్యాక్సిన్ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నిత్యం ఇంటింటా తిరుగుతూ వ్యాక్సిన్ ఇస్తున్నారు.
కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు..
మెదక్ జిల్లాలో ఇప్పటికే వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకూ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్ని కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 18ఏండ్లు నిండిన విద్యార్థులకు వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్ వేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్లలోని కళాశాలలు మొత్తం 104 ఉన్నాయి. మొత్తం కళాశాలల్లో 1,600 మంది 18ఏండ్లు నిండిన విద్యార్థులున్నారు. వీరందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ అందిస్తాం. కరోనాను దృష్టిలో ఉంచుకుని 18ఏండ్లు నిండిన ప్రతీ విద్యార్థి వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి.
18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా..
మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 18ఏండ్లు నిండిన విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేస్తాం. ఇప్పటికే వైద్య సిబ్బందితో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. జిల్లాలో మొత్తం 12,310 మంది విద్యార్థులుండగా, అందులో 18 ఏండ్లు నిండిన వారు 460 మంది ఉన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా వ్యాక్సిన్ ఇచ్చాం. మిగిలిన వారందరికీ టీకా వేస్తాం.