మెదక్, ఏప్రిల్ 19 (నమస్తే తెలం గాణ): జిల్లా , డివిజన్, మండల స్థాయిలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్యదర్శులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో పని చేస్తున్న కొందరు కార్యదర్శులు ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 492 పంచాయతీల్లో 34 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఇన్చార్జుల పాలన సాగుతున్నది. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక కార్యదర్శులు ఇంటి అనుమతులతో పాటు ఆస్తి పన్ను వసూలు, గ్రామ సభల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారు.
అల్లాదుర్గ మండలంలో 16 పంచాయతీలు, చేగుంట 25, చిలిపిచెడ్ 19, హవేళీఘనపూర్ 30, కౌడిపల్లి 35, కొల్చారం 21, మనోహరాబాద్ 17, మసాయిపేట 13, మెదక్ 21, నర్సాపూర్ 35, నర్సింగ్ 9, నిజాంపేట 16, పాపన్నపేట 40, రామాయంపేట 16, రేగోడ్ 18, పెద్దశంకరంపేట 27, చిన్నశంకరంపేట 31, శివంపేట 37, టేక్మాల్ 14, తూప్రాన్ 14, వెల్దుర్తి 23 పంచాయతీలున్నాయి. 492 పంచాయతీల్లో 339 పంచాయతీలకు సొంత భవనలు, 125 పంచాయతీలు ఇతర ప్రభుత్వ భవనల్లో కొనసాగుతున్నాయి. 28 పంచాయతీలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శుల అవినీతి, అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ నిర్వహణతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులకు పరిపాలన సహాయం చేయడం, గ్రామ సభలు , సమావేశాలు నిర్వహించాలి. పంచాయతీకి సంబంధించిన రికార్డులు నమోదు చేయాలి. జనన, మరణ ధ్రువపత్రలు జారీ చేయాలి. పంచాయతీ పరిధిలో పన్నులు (ఇంటి, నీటి పన్నులు) వసూలు చేయాలి. ఆస్తుల రిజిస్ట్రర్, అభివృద్ది పనుల వివరాలు నమోదు చేయాలి. గ్రామ పంచాయతీ నిధుల ఖాతాలు నిర్వహణతో పాటు ఆదాయ వసూలు పెంచేందుకు ప్రయత్నం చేయాలి. గ్రామం లో రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీటి సదుపాయాలు పర్యవేక్షించాలి.
అవినీతి, అక్రమాలకు పాల్పడే పంచాయతీ కార్యదర్శులపై విచా రించి చర్యలు తీసుకుంటాం. ఇంటి అనుమతుల పేరుతో డబ్బులు వ సూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. విచారించి నివేదిస్తాం. ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. జిల్లాలో 91 శాతం ఆస్తి పన్నులు వసూలు చేశాం.
– యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి మెదక్