సిద్దిపేట, సెప్టెంబర్ 10: హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్లాగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో రూ.6 కోట్లతో నిర్మించిన శ్రీమహారేణుకా (ఎల్లమ్మ) తల్లి గౌడ ఏసీ కన్వెన్షన్ సెంటర్ను శాసనసభా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గౌడ కులస్తులకు సౌకర్యవంతంగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు రూ. 6కోట్లతో ఏసీ కన్వెన్షన్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. గౌడ కులస్తులందరికీ ఉచితంగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఈ కన్వెన్షన్ ఉపయోగపడుతుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్శాఖ దాడులు, చెట్టు పన్నుతో ఇబ్బందులకు గురికావడమే కాకుండా, గీత కార్మిక సొసైటీలను రద్దు చేసి ఇబ్బందులకు గురి చేశారన్నారు. తెలంగాణ ఏర్పడ తర్వాత సీఎం కేసీఆర్ గీత పారిశ్రామిక సంఘాలను పునరుద్ధరించి చెట్టు పన్నును రద్దు చేశారన్నారు. లంచం కోసం ఆనాటి పాలకులు, అధికారులు కల్లు డిపోలను మూసివేయగా, నేడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించిందన్నారు. గీత కార్మిక సహకార సొసైటీలు ఉంటే గౌడ జాతి అభివృద్ధి చెందుతుందన్నారు. గౌడ జాతి గౌరవం పెంచేలా సర్దార్ పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మూడు కోట్లతో ట్యాంక్ బండి పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని సీఎం నెలకొల్పుతున్నారన్నారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ కోసం సహకారం అందిస్తానన్నారు.
అన్నిరకాలుగా సిద్దిపేట అభివృద్ధి
హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే అన్నిరకాల అభివృద్ధి కనబడుతున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. సిద్దిపేటలో హరీశ్రావు ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టమన్నారు. దిష్టితగిలేలా రాష్ట్రంలోనే ఎకడా లేని విధంగా సిద్దిపేటలో గౌడ కులస్తులకు ఏసీ కన్వెన్షన్ హాల్ నిర్మించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కన్వెన్షన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టమన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రత్యేకంగా మాట్లాడి చెట్టు పన్ను రద్దు చేయించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి మంత్రి తన్నీరు హరీశ్రావుతో పాల్గొంటూ ఆయన పనితీరును దగ్గరగా చూశానన్నారు. మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. అన్నిరకాల అభివృద్ధి, పర్యాటక కార్యక్రమాలకు సిద్దిపేట రోల్మోడల్ మారిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, పల్లె లక్ష్మణ్ గౌడ్, సిద్దిపేట జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.