సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 10 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడునెలలు గడుస్తున్నా పింఛన్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ శనివారం సిద్దిపేటలోని డబుల్ బెడ్ రూమ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం నేత కెమ్మసారం అశోక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో లెక్కకు మించి హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఒక నెల పింఛన్ పెండింగ్లో ఉన్నా.. జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాపై ప్రభుత్వం కక్షకట్టిందని, కొన్ని జిల్లాల్లో పింఛన్లు ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ సిద్దిపేటకు ఇవ్వకపోవడం ఏంటని మండిపడ్డారు. చాలామంది వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు పింఛన్పైనే ఆధారపడి బతుకుతారని, డబ్బులు వస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉందని అన్నారు. పింఛన్లు పెంచి మార్పు తెస్తామని చెప్పి, ఇప్పటివరకు ఇచ్చే పింఛన్ కూడా సరిగా ఇస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధానాన్ని అవలంబిస్తే సిద్దిపేట జిల్లా పింఛన్దారులంతా ఏకమై రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.