రూపాయి ఖర్చు లేకుండా.. ఎవరికీ లంచం ఇవ్వకుండా రూ.60 లక్షలు విలువ చేసే 2 బీహెచ్కే ఫ్లాట్ని ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందజేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం ఆయన అందజేశారు. భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్లతో పాటు హైదరాబాద్లోని ఆరు నియోజకవర్గాలకు చెందిన మొత్తం 3500 మంది లబ్ధిదారులకు ఆయా ఎమ్మెల్యేలతో కలిసి ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిపక్షాలు మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తాయని, వాటిని నమ్మొదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. వచ్చే ఎన్నికల్లో మరొకసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
రామచంద్రాపురం, సెప్టెంబర్ 2 :పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్ను నిండుమనస్సుతో ఆశీర్వదించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రూ.60లక్షలు విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేశామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పగా చెప్పుకునే బీజేపీ ఏ రాష్ట్రంలోనైన ఈ విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించిందా.? అని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాల్లో అన్ని ట్రబుల్స్ మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అబద్ధపు మాటలకు ప్రజలు మోసపోవద్దని, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదించాలన్నారు. బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో నిర్మించిన 2బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కొల్లూర్-1 ప్రాజెక్ట్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
అనంతరం పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్లతో పాటు శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు చెందిన 3500 మంది లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, జాఫర్ హుస్సేన్, రాజాసింగ్లతో కలిసి మంత్రి హరీశ్రావు లబ్ధిదారులకు 2బీహెచ్కే ఇంటి పట్టాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలు వస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు రావడంతో అందరి ముఖాల్లో అంత సంతోషం కన్పిస్తున్నదన్నారు. రూపాయి ఖర్చు లేకుండా..లంచం ఇవ్వకుండా రూ.60లక్షలు విలువ చేసే 2బీహెచ్కే ఇంటిని ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. 2బీహెచ్కే ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు అదృష్టవంతులన్నారు.
కొల్లూర్, అమీన్పూర్ ప్రాంతాలు ధనికులు ఉండే ప్రాంతాలని, ఇలాంటి ప్రాంతాల్లో పేదలు సగౌరవంగా బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల వారిని సమానంగా చూస్తున్నారని, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్లో రూ.9వేల కోట్లతో లక్ష ఇండ్లను కట్టించిందన్నారు. మొదటి విడుతలో భాగంగా 11,700 ఇండ్లను పంపిణీ చేశామని, కొల్లూర్లోనే 3500 ఇండ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని లబ్ధిదారులకు ప్రతినెలా ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్ట్ని ప్రభుత్వం కొల్లూర్లో సకల సౌకర్యాలతో నిర్మించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.60వేలు ఇచ్చేవారని, అందులో రూ.20వేలు సబ్సిడీ ఇచ్చి రూ.40వేలు తిరిగి కట్టించుకునే వారని గుర్తు చేశారు. రూ.60వేలకు బేస్మెంట్ కూడా అయ్యేది కాదని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో వేసవి వస్తే నీటి కష్టాలు వచ్చేవని, మిషన్ భగీరథతో నీటి కష్టాలు తీరాయన్నారు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్డుపైకి వచ్చే రోజులు పోయాయని, ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీటిని అందిస్తున్నామన్నారు. స్వర్గీయ పీజేఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎండాకాలం వస్తే నీటి సమస్యలతో ఆయన పరేషాన్ అయ్యేవారని గుర్తు చేశారు. మన ప్రభుత్వంలో నీటి ధర్నాలు లేవు..వేసవి కష్టాలు లేవన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం సహకారం అందజేస్తుందన్నారు. హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందజేస్తున్నామని చెప్పారు. తోటి ఎమ్మెల్యేల కోరిక మేరకు కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, దవాఖాన, ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయిస్తామని మంత్రి తెలిపారు.
ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు ః మంత్రి
ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే అందమైన మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని మంత్రి హరీశ్రావు సూచించారు. రాజకీయ పార్టీలు చీటికిమాటికీ ధర్నాలు, నినాదాలు చేస్తారు. వారు జిందగి మొత్తం ధర్మాలు, నినాదాలకే పరిమితమవుతుందని చురకలు అంటించారు. బీఆర్ఎస్ సర్కార్ తక్కువ చెబుతుంది..పని ఎక్కువగా చేసి చూపిస్తుందన్నారు. బీజేపీ నాయకుల మాటలు ఎక్కువగా ఉంటాయి..పని తక్కువగా ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద బాధితులకు బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తామని చెప్పారు..కానీ బండి లేదు చివరికి గుండు లేదు అని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పగా చెప్పుకునే బీజేసీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారా? ఆయా రాష్ర్టాల్లో ఉన్న ప్రజలకు అన్ని కష్టాలేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు చాలా మాటలు చెబుతారు కానీ ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. పని చేసే వాళ్లు ఎవరు, మాటలు చెప్పే వారు ఎవరు అనేది ప్రజలు గ్రహించాలన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడిని మీరు ఆశీర్వదించాలని ప్రజలకు మంత్రి హరీశ్రావు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్కుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, తెల్లాపూర్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తాం
– ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లల్లో స్థానికులకు పదిశాతం కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. పటాన్చెరు నియోజకవర్గంలో 40వేల ఇండ్లను ప్రభుత్వం కట్టించిందన్నారు. మంత్రి హరీశ్రావుతోకలిసి మొదటి విడుతలో 500మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశామన్నారు. పేదరికంలో బతుకుతున్న వారికి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆధునిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. పూర్తి పారదర్శకతతో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారికి ఇండ్లను కేటాయించామన్నారు.
వివిధ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు ఇకమీదట పటాన్చెరు నియోజకవర్గంలో నివసించబోతున్నారని, ఈ రోజు నుంచి వీరంతా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలని, కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, జాఫర్ హుస్సేన్, రాజాసింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని విమర్శలు చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వారు కొనియాడారు.
కేసీఆర్ సారే మళ్లీ సీఎం కావాలి
సీఎం కేసీఆర్ సాబ్ మాకు సొంత ఇల్లు ఇచ్చారు. ఇక నుంచి కిరాయి కట్టే బాధ తప్పింది. డబుల్బెడ్రూం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాం. రూపాయి ఖర్చు లేకుండా మాకు డబుల్ బెడ్రూం ఇళ్లు రావడం చాలా సంతోషంగా ఉంది. గరీబోళ్లకు మస్తు సాయం చేస్తున్న దేవుడు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్కు అల్హ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.
– అమ్తుల్ ముబీన్ఫాతీమ, ఆసీఫ్నగర్, హైదరాబాద్, ఆర్సీపురం
చాలా సంతోషంగా ఉంది
కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది. అసిఫ్నగర్లో కిరాయి ఇంట్లో ఉంటున్నాం. నెలకు రూ.5వేలు కిరాయి కడుతున్నాం. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అధికారులు ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్కే ఓటు వేస్తాం.
– సయ్యద్ బషీర్ ఉన్నిసా బేగం, నాంపల్లి, ఆసీఫ్నగర్, ఆర్సీపురం
జీవితంలో సొంతిల్లు వస్తదనుకోలేదు..
జీవితంలో సొంతిల్లు సమకూరుతదని అనుకోలేదు. డబుల్ బెడ్రూం ఇంటి కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాం. ఇల్లు వస్తుందో రాదో అనుకున్నాం. అధికారులు ఫోన్ చేసి ఇల్లు వచ్చిందని చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. మాకు నలుగురు పిల్లలు, నా భర్త ఆటో నడుపుతుండు. పదకొండేండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నాం. నెలకు రూ.6వేలు కిరాయి కడుతున్నాం. ఇప్పుడు మా కష్టాన్ని సీఎం కేసీఆర్ సార్ తీర్చిండు. మరోసారి బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం.
– సోనిబాయ్, గోషామహాల్, ఆర్సీపురం