చేర్యాల, నవంబర్ 23: చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటాపాటలతో విద్యాబుద్ధులు చెప్పేందుకు అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. కానీ, పౌష్టికాహార లోపం చిన్నారుల ఎదుగుదలకు అవరోధంగా మారుతోంది. ఇది కాస్తా చిన్నారుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చిన్నారులలో పౌష్టికాహార లోపం తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నది. తద్వారా బాల్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు న్యూట్రీషిన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్) అనే యాప్ అమలుకు శ్రీకారం చుట్టింది. యాప్కు అమలుకు సంబంధించి అంగన్వాడీలకు శిక్షణ సైతం ఇటీవల పూర్తయ్యింది.
చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టులో పరిధి(చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట,కొండపాక,కుకునూర్పల్లి)లో
187 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఆయా మండలాలు, సెక్టార్లలో 801 మంది తల్లులు, 970 మంది
గర్భిణులు, 796 మంది 6 మసాల చిన్నారులు, 4379 మంది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఆయా కేంద్రాల ద్వారా మొత్తం 11312 మంది లబ్ధిపొందుతున్నారు. ఐసీడీఎస్ ద్వారా చిన్నారులకు సేవలు అందించేందుకు సీడీపీవో, సూపర్వైజర్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు అందజేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల పూర్తిస్థాయి పర్యవేక్షణకు ఎన్హెచ్టీఎస్ యాప్ ఎంతో ఉపయోగపడనున్నది. ఈ యాప్తో అంగన్వాడీలకు పని భారం తగ్గడంతో పాటు రికార్డుల నిర్వహణ లేకుండా పోనున్నది. ఎన్హెచ్టీఎస్ యాప్పై చేర్యాల ప్రాజెక్టు పరిధిలో సీడీపీవో శారద ప్రత్యేక శ్రద్ధ వహించి అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు యాప్పై శిక్షణ పూర్తి చేశారు. వీటిల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నా కొందరిలో పౌష్టికాహారం లోపిస్తున్నది.
ఫలితంగా ఆశించిన స్ధాయిలో చిన్నారులలో ఎదుగుదల లేదని అధికారులు గుర్తించారు. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులకు బలవర్ధకమైన బాలామృతంతో పాటు ప్రత్యేక ఆహారాన్ని అందించనున్నారు. ఎన్హెచ్టీఎస్ యాప్లో అంగన్వాడీ టీచర్ల హాజరు, చిన్నారుల పెరుగుదల పర్యవేక్షణ, ఆహార నిల్వలు, గర్భిణుల వివరాలు, టీకాలు వేసే సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్లో అంగన్వాడీల సమగ్ర వివరాలు ఉండడంతో చిన్నారులకు వందశాతం పౌష్టికాహారం సక్రమంగా అందడం, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడటానికి దోహదపడుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం నిరంతరం అంగన్వాడీ కేంద్రాలు, అధికారులు, సిబ్బంది పని చేస్తున్నా రు. ఎన్హెచ్టీఎస్ యాప్తో నిరంతర పర్యవేక్షణకు అవకా శం ఉంది. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడానికి అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు మరింత పారదర్శకంగా ఉండేందుకు ఎన్హెచ్టీఎస్ యాప్ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లకు ఇటీవలే శిక్షణ ఇచ్చాం. బాల్యం బలంగా ఉంటే భవిష్యత్ బాగుంటుంది. ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది.
– శారద, సీడీపీవో, ఐసీడీఎస్ చేర్యాల ప్రాజెక్టు