జాతీయ రహదారుల నిర్వహణ, విస్తరణను కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఎన్హెచ్- 65 శేరిలింగంపల్లి నుంచి బీదర్ సరిహద్దు వరకు 90 కిలోమీటర్లకు పైగా నాలుగు లేన్ల రహదారి ఉంది. ఇందులో మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 46 కిలోమీటర్ల రహదారిని ఆరులేన్లుగా మార్చాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో పాటు రాష్ట్ర అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. సర్వీస్ రోడ్డుతో పాటు తొమ్మిది ప్రాంతాల్లో వెహికిల్ అండర్ పాస్లు, ైఫ్లై ఓవర్లు నిర్మించాలని రూ.1500 కోట్లతో డీపీఆర్ తయారుచేసి సమర్పించారు. ఏడాదిన్నర గడుస్తున్నా నిధుల మంజూరులో బీజేపీ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో విస్తరణ కోసం రూ.1250 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించినప్పటికీ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది ప్రశ్నార్థకంగానే ఉంది. మరోవైపు లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కొంతకాలంగా కేంద్రం నిర్వహణ నిధులు విడుదల చేయకపోవడంతో అడుగడుగునా గుంతలు పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగా పనులు పూర్తి చేసి ఆరులేన్లుగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని ఎన్హెచ్-65 విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా గతేడాది 150కి పైగా ప్రమాదాలు చోటుచేసుకోగా, వేర్వేరు ప్రమాదాల్లో 30మందికి పైగా మృతిచెందారు. సంగారెడ్డి జిల్లాగుండా ఎన్హెచ్65 శేరిలింగంపల్లి నుంచి బీదర్ సరిహద్దు వరకు 90 కిలోమీటర్లకు పైగా రహదారి విస్తరించి ఉంది. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఆరులేన్ల పనుల కోసం ప్రతిపాదనలు పంపి ఏడాదిన్నర కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరులో జాప్యంతో పాటు పనులు ప్రారంభించడం లేదు. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు 46కిలోమీటర్ల ఎన్హెచ్-65 రహదారిని ఆరు లేన్లుగా మార్చాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఏడాది క్రితం ప్రతిపాదనలు పంపింది. నాలుగు నెలల క్రితం 6 లేన్ల రహదారుల విస్తరణ పనుల కోసం రూ. 1500 కోట్లతో కేంద్రానికి రాష్ట్ర పరిధిలోని అధికారులు ప్రతిపాదనలు పంపారు. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు వాహనాల ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆరు లేన్ల రహదారి పనులకు ప్రతిపాదించారు. సర్వీస్ రోడ్డుతో పాటు 9 ప్రాంతాల్లో వెహికిల్ అండర్ పాసులు ,ైఫ్లైఓవర్లను నిర్మించాలని డీపీఆర్ తయారుచేశారు. సంగారెడ్డి చౌరస్తా, కందిచౌరస్తా. ఐఐటీ సమీపంలో రుద్రారం సమీపంలో లక్డారం చౌరస్తాలో,ఇస్నాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. డీపీఆర్ సమర్పించి నెలలు గడుస్తున్నా కేంద్రప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచండంతో ఇటీవల ఎన్హెచ్ 65 విస్తరణ పనులకు రూ.1250 కోట్లు విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిధులు ప్రకటించినప్పటికీ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది ప్రశ్నార్థకంగానే ఉన్నది.
సంగారెడ్డిలో ఎన్హెచ్-65 రహదారి అధ్వానంగా మారింది. లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు 32 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి ఉంది. ఈ రహదారి నిర్వహణ అధ్వానంగా మారింది. రహదారి నిర్వహణ పనుల కోసం కేంద్రం ఏటా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే కొంతకాలంగా నిర్వహణ నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు జాతీయరహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొటుంటున్నారు. సంగారెడ్డి చౌరస్తా, కంది, ఐఐటీ, రుద్రారం, ఇస్నాపూర్, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రహదారి గుంతలుగా మారిం ది. చాలాచోట్ల రోడ్డు డివైడర్లు దెబ్బతిన్నాయి.రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున మట్టి, ఇసుక పేరుకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది 157 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, అందులో 30వరకు లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు ఉన్న జాతీయ రహదారిలో జరిగాయి. ప్రతిరోజు వాహనదారులు ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్-65 జాతీయ రహదారి నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదు. మరోవైపు విస్తరణ పనుల్లోనూ తీవ్ర జాప్యం చేస్తున్నది. ఈ కారణంగా జిల్లా ప్రజలతో పాటు ఈ రహదారి గుండా ప్రయాణించే వేర్వేరు రాష్ర్టాలకు చెందిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రూ.1250 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పనులు చేపట్టేందుకు టెండర్లు నిర్వహించాల్సి ఉంది. టెండర్ల నిర్వహణకే ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పెద్ద కంపెనీలు రోడ్డు విస్తరణ పనులు చేపట్టే విషయంలో ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎన్హెచ్-65 పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ప్రజలు అని ఎదురుచూస్తున్నారు.