మెదక్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ప్రజల సేవ కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవొచ్చని మెదక్ ఎస్పీ డాక్టర్ బి.బాలస్వామి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీ డాక్టర్ బి.బాలస్వామిని అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్. మహేందర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదని, జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, అక్రమ కార్యకలాపాలు, రోడ్డుప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
పోలీస్స్టేషన్కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతి ఒకరితో మర్యాద, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. 2018 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన డాక్టర్ బి.బాలస్వామి కాగజ్నగర్లో ఇన్చార్జి ఎస్డీపీవోగా పనిచేశారు. 2021 నవంబర్లో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్గా విధులు నిర్వర్తించి, ఇకడి నుంచి రాచకొండ కమిషనరేట్లో ఎస్బీడీసీపీగా, అనంతరం సౌత్ వెస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ డీసీపీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం మెదక్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన ఎస్పీ డాక్టర్ బి.బాలస్వామిని మెదక్ డీఎస్పీ ఫణీంద్ర, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, డీసీఆర్బీడీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెల్ డీఎస్పీ ఎస్ఆర్. సుభాష్ చంద్రబోస్, ఏఆర్ డీఎస్పీ ఎస్ఆర్ రంగ నాయక్, జిల్లాలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు ఏఆర్ఎస్ఐలు, డీపీవో సిబ్బంది కలిశారు.