నర్సాపూర్, నవంబర్ 14: తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజాబాంధవుడిగా నిలిచారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, జిల్లా మంత్రి హరీశ్రావు సహకారం, ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి కృషితో అభివృద్ధి బాట పట్టింది. పేదింటి ఆడబిడ్డలున్న ఇండ్లల్లో కల్యాణలక్ష్మితో పెండ్లిబాజాలు మోగుతుండగా… మసక బారిన కండ్లల్లో కంటి వెలుగులు ప్రసరిస్తున్నాయి…రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్ రైతు కుటుంబాల్లో భరోసా నిస్తున్నాయి. ఎన్నో ఏండ్ల కలైన ఆర్టీసీ డిపో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మంజీరా, హల్దీ వాగులపై చెక్డ్యామ్లను నిర్మించి వ్యవసాయానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ప్రతి గ్రామం, తండాలకు మిషన్ భగీరథ నీటిని అందించి మహిళల కండ్లల్లో సంతోషాన్ని నింపింది. దళిత ప్రజలకు దళితబంధు పథకాన్ని చేరువ చేసి వారి ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది. రైతుల సమస్యలను నివృత్తి చేయడానికి రైతు వేదికలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి నాంది పలికింది. ఇలా ఇంకా ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులతో నర్సాపూర్ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది.
మండలాల్లో నిర్మించిన రెండు వరుసల రోడ్లతో ప్రయాణికులకు ప్రయాణం సులభతరంగా మారింది. శివ్వంపేట్ మండలంలోని చిన్నగొట్టిముక్ల నుంచి తూప్రాన్ మండలం మనోహరాబాద్ వరకు రూ.2.56 కోట్లతో రెండు వరుసల రోడ్డును ప్రభుత్వం నిర్మించింది. నర్సాపూర్ నుంచి కుకునూర్, వెల్దుర్తిని కలుపుతూ తూప్రాన్ వరకు 41 కి.మీటర్ల దూరం రూ.40 కోట్లతో డబుల్ రోడ్డును నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. రూ.4 కోట్లతో దుంపలకుంట నుంచి రంగంపేట్ వరకు 4.5 కి.మీ దూరం డబుల్ రోడ్డును ఏర్పాటు చేసింది. రూ. 23 కోట్లతో నాగుల్దేవులపల్లి నుంచి చిల్కూల్ వరకు 14 కి.మీ దూరం రెండు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తయింది.
నియోజకవర్గం పరిధిలోని కొల్చారం మండలంలో మంజీరా నది, హల్దీ వాగు, వెల్దుర్తి మండలంలో హల్దీవాగు, చిలిపిచెడ్ మండలంలో మంజీరా నది ప్రవహిస్తున్నది. ఈ నీటిని ఒడిసి పట్టి రైతులకు సాగునీటిగా అందించేందుకు ప్రభుత్వం చెక్డ్యామ్లు నిర్మిస్తున్నది. ఎమ్మెల్యే మదన్రెడ్డి చొరవతో చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.67.44 కోట్లు మంజూరు చేసి పది చెక్డ్యామ్లను నిర్మించింది. ఇందులో 7 నిర్మాణం పూర్తి కాగా, 3 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణం పూర్తయిన చెక్డ్యామ్లు నిండి జలకళ సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు సైతం పెరిగి రైతులకు సాగునీటి కష్టాలు తీరాయి.
నియోజకవర్గంలోని నర్సాపూర్ మండ లం చిప్పల్తుర్తి నుంచి వెల్దుర్తి మండలం మంగళ్పర్తి గ్రామ శివారు వరకు 18వ ప్యాకేజీలో భాగంగా 44 కి.మీటర్ల వరకు కాళేశ్వరం కాలువ నిర్మాణం కొనసాగుతున్నది. ఈ కాలువ పూర్తైతే సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అలాగే, రెడ్డిపల్లి గ్రామ శివారులో నుంచి చిప్పల్తుర్తి గ్రామ శివారు వరకు 4.25 కి.మీటర్ల దూరం టన్నెల్ను నిర్మిస్తున్నారు. సమైక్య పాలనలో అభివృద్ధ్దికి ఆమడదూరంలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గం.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధ్దికి కేరాఫ్గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ సహకారాలతో ఎమ్మెల్యే మదన్రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడంతో నర్సాపూర్ ప్రగతి పరుగులు తీసింది.
రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా 25 రైతు వేదికలను నిర్మించారు. సాగునీటికి ఇబ్బందులు రాకుండా రూ.67.44 కోట్లతో మంజీరా నది, హల్దీ వాగులపై చెక్డ్యామ్లు నిర్మించారు. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి నుంచి వెల్దుర్తి మండలం మంగళ్పర్తి వరకు 44 కిలోమీటర్ల వరకు కాళేశ్వరం కాల్వ నిర్మాణ పనులు కొనసాగు తున్నాయి. రూ.110 కోట్లు వెచ్చించి 248 వాటర్ ట్యాంకులు నిర్మించి, 800 కి.మీ దూరం పైప్లైన్లు వేసి ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నది. ప్రమాదాలు, ఇతర ఘటనల్లో ప్రాణాపాయ స్థితిలో దవాఖానకు వచ్చిన వారికి ఆక్సిజన్కు ఇబ్బంది లేకుండా రూ.50 లక్షలతో ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను అందుబాటు లోకి తెచ్చింది. మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ పనులు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది.
నీళ్లు అన్ని మండలాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందుతున్నది. ఇంటింటికీ నీళ్లు సరఫరా చేసేందుకు రూ.110 కోట్లతో వాటర్ ట్యాంకులు, పైపులైన్లు వేసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 248 వాటర్ ట్యాంకులను నిర్మించి, 800 కి.మీ దూరం పైప్లైన్ వేసి మంచి నీటిని అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. గ్రామ పంచాయతీలే కాకుండా గిరిజన తండాలకు సైతం మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నది.
నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.69.41 కోట్లు మంజూరు చేసింది. బీటీ రోడ్ల పునరుద్ధరణకు రూ.6.70 కోట్లు కేటాయించింది. టెండర్లను పిలిచి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కాగా, నర్సాపూర్ మండల పరిధి కోక్యాతండా నుంచి హత్నూరా మండలం దౌలాపూర్ వరకు 5 కి.మీటర్ల దూరం రూ.2.80 కోట్లతో బీటీ రోడ్డు పూర్తైంది.
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది చనిపోయిన సంఘటనలు మన కళ్ల ముందు ఇంకా మెదులాడుతూనే ఉన్నాయి. ఇలాంటివి పునరావృతం కావద్దని సర్కారు దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రూ.50 లక్షలతో 500 ఎల్పీఏ సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో దవాఖానలోనే ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి రోగులకు అందిస్తుండడంతో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గంలో 37,043 మంది దళితులున్నారు. నర్సాపూర్, శివ్వంపేట్, మాసాయిపేట్, కౌడిపల్లి, చిలిపిచెడ్ మండలాల్లో మొదటి విడుతలో ప్రభుత్వం 98 కుటుంబాలకు పథకం వర్తింపజేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులు వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధిపొందుతున్నారు.
అడవుల శాతాన్ని పెంచి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ను ఏర్పాటు చేసింది సర్కార్. ఇందులో పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఔషధమొక్కలు, క్లాక్టవర్లను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానికులే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పార్క్ అందాలను వీక్షిస్తున్నారు. పర్యాటకులు బస చేయడానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న కాటేజీ నిర్మాణాల పనులు చివరి దశకు చేరుకున్నాయి. వీటి నిర్మాణం పూర్తైతే పర్యాటకుల తాకిడి పెరిగి, నర్సాపూర్ పట్టణం పర్యాటక కేంద్రంగా మారనుంది.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే నర్సాపూర్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఏండ్ల నాటి ఆర్టీసీ బస్డిపో కల సీఎం కేసీఆర్ కృషితో నెరవేరింది. మంజీరా, హల్దీ వాగులపై చెక్డ్యామ్లను నిర్మించి రైతుల సాగునీటి కష్టాలు తీర్చాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయి. ప్రతిఒక్కరు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్నారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని నమ్మకం ఉంది. ప్రజల ఆశీర్వాదంతో నర్సాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి విజయానికి నాతో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కృషిస్తు న్నాం. తప్పక మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం.
బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నర్సాపూర్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తా. అర్హులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తా. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం నీటితో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను నింపి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. ఇతర పార్టీలతో అభివృద్ధి సాధ్యపడదు. బీఆర్ఎస్ పార్టీని గెలుపించుకొని నర్సాపూర్ని అభివృద్ధి చేసుకుం దాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ప్రస్తుత ఎమ్మెల్యే మదన్రెడ్డి సహాయ సహకారాలతో నిధులు తెచ్చి అన్నిరంగాల్లో నర్సాపూర్ను అగ్రగామిగా నిలుపుతా.
వ్యవసాయంలో రైతుల సందేహాలను నివృత్తి చేసి వారికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ క్లస్టర్కి ఒక రైతువేదికను రూ.22 లక్షలు వెచ్చించి 25 రైతు వేదికలు నిర్మించింది. నర్సాపూర్ మున్సిపాలిటీలో 1, మండల పరిధిలో 4 అందుబాటులోకి తెచ్చింది. శివంపేట్ మండలంలో 4, కొల్చారం మండలం 5, వెల్దుర్తి మండలం 6, కౌడిపల్లి మండలం 3, చిలిపిచెడ్ మండలంలో 2 ఏర్పాటు చేసింది. ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటు రైతువేదికలో వారి సమస్యలు, సందేహాలు తెలుసుకొని పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో రూ.2 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించింది. మున్సిపల్ భవనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, గ్రంథాలయం, అండర్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్, సీసీ రోడ్లు నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలన్న నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను బీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చింది. 1998లో టీడీపీ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ నర్సాపూర్ మండల కేంద్రంలో 5 ఎకరాల్లో బస్డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజకీయ కారణాలతో డిపో పనులు మూలనపడ్డాయి. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ 2018లో డిపో నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేశారు. దీంతో అత్యాధునిక భవన నిర్మాణం పూర్తయి ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే కొత్తగా ఏర్పడిన మొట్టమొదటి నర్సాపూర్ డిపోగా చరిత్రలో నిలిచింది. జూన్ 8, 2022న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆర్టీసీ బస్డిపోను ప్రారంభించారు.