జహీరాబాద్, సెప్టెంబర్ 25: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) నారింజ వాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల పరిధిలోని వాగులు, వంకలు, చెక్డ్యామ్ల ద్వారా వరద నీరు భారీగా తరలివస్తున్నది. దీం తో ఇరిగేషన్ అధికారులు ఒక గేటు కొంత మేరకు ఎత్తడంతో పాటు ప్రాజెక్టు గేట్ల మీదుగా వరద కర్ణాటక వైపు తరలివెళ్తున్నది. జహీరాబాద్ ప్రాంతంలోనే పుట్టిన నారింజ ప్రాజెక్టు జలాలను ఇక్కడి రైతులు ఉపయోగించుకుంటున్నది మాత్రం చాలా తక్కువ.
వృథాగా కర్ణాటక ప్రాంతానికి తరలివెళ్తున్న జలాలను కొంతమేర సద్వినియోగం చేసుకునేందుకు జహీరాబాద్ మం డలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులో నారింజ వాగుపై 1970లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించింది. 1971లో ప్రాజెక్టు కింద 15 కిలోమీటర్ల దూరం కుడి, ఎడమ కాల్వలను తవ్వించి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద న్యాల్కల్, జహీరాబాద్ మండలాల పరిధిలోని 3,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయినప్పటికీ ఏ కాల్వ సాగుకు అనువుగా లేకుండా పోయింది. దీంతో గ్రామా ల్లో గుంట భూమికి సాగునీరు పారిన దాఖలాలు లేవు. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్లు. గత ప్రభుత్వాలు చేపట్టిన జన్మభూమి, జలయజ్ఞం, మిషన్ కాకతీయ ఫథకాలు కూడా ప్రాజెక్టు దశను మార్చలేకపోయాయి. దీంతో ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టు వరద నీటితో నిండి గేట్లపై నుంచి నీరు వృథాగా కర్ణాటక వైపు వెళ్తున్నది. ఈ నీరు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని కరింజ ప్రాజెక్టులోకి చేరుతుంది. అక్క డి రైతుల సాగుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
2012లో అప్పటి ప్రభుత్వం రూ.5.77 కోట్లతో ప్రాజెక్టు షెటర్లు, కట్ట మరమ్మతులు చేయించింది. 2015లో ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరందించేందుకు కుడి,ఎడమ కాల్వల మరమ్మతు పనులు అసంపూర్తిగా చేపట్టి వదిలేశారు. మూడేండ్ల క్రితం రూ.18 లక్షలు ఖర్చుచేసి ప్రాజెక్టులో నామమాత్రంగా పూడికతీత పనులు చేశారు. పాలకులు, అధికారులు ప్రాజెక్టును పట్టించుకోకపోవడం, కాల్వల నిర్మాణం తదితర మరమ్మతు పనులు చేపట్టకపోవడం వల్ల ఈ ప్రాంత రైతులకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతున్నది. ్రఏటా ప్రాజెక్టులోకి వరద రావడం..వృథాగా కర్ణాటక వైపు వెళ్లిపోతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా ప్రాజె క్టు కింద ఆయకట్టు సాగుకు నోచుకోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.