నారాయణఖేడ్, సెప్టెంబర్ 30: సీఎం కేసీఆర్కు మరోసారి పట్టం కట్టాలని, దళిత బంధు అర్హులందరికీ దశల వారీగా వస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గంలో రెండో విడత దళితబంధు లబ్ధిదారులకు నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జుజాల్పూర్ శివారులోని హెచ్ఆర్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తంతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకంలో భాగంగా తొలి విడతలో 100 కుటుంబాలు, రెండో విడతలో 1100 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తుండడంతో విపక్ష పార్టీల్లో ఆందోళన పెరుగుతున్నదన్నారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. గత ప్రభుత్వాలు ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చాయని, కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని పార్టీలకతీతంగా అమలు చేస్తున్నదన్నారు.
దళితబంధు పథకం కింద ఎంపిక చేసిన మొదటి, రెండో విడతల లబ్ధిదారులకు కేటాయించడంలో సంగారెడ్డి జిల్లాలోనే నారాయణఖేడ్ ముందున్నదన్నారు. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధుల చురుకైన పనితనమే కారణమని ఎమ్మెల్యే అభినందించారు. దళిత బంధు యూనిట్లను ఎంపిక చేసుకోవడంలో లబ్ధిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి దళితుడు సంపన్నుడిగా ఎదగాలనే సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి మరోసారి సీఎం కేసీఆర్కు పట్టంకట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు నరోత్తమ్ను సన్మానించారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్ మోహన్, విజయ డెయిరీ ఈడీ మోహన మురళీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చారి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దళితుల అభివృద్ధికి దళితబంధు
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చారని రాష్ట్ర ఎస్సీ కారొషన్ చైర్మన్ వై.నరోత్తమ్ అన్నారు. ఇంత మంచి పథకం దేశంలో మరెక్కడా లేదని, వంద శాతం సబ్సిడీతో రూ.10 లక్షలు అందజేయడంతోపాటు లబ్ధిదారులు తమ యూనిట్లను సమర్థవంతంగా నిర్వహించుకునేలా అవగాహన కల్పిస్తుండడం గొప్ప విషయమన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా తనకివ్వడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్క దళితుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. దళితబంధు నిరాటంకంగా కొనసాగాలంటే మరోసారి సీఎం కేసీఆర్ను, ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని దీవించాలని కోరారు.