నారాయణఖేడ్, ఏప్రిల్ 20: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న హత్యారాజకీయాలను సహించబోమని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి హెచ్చరించారు. శనివారం నారాయణఖేడ్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిర్గాపూర్ మండలం సింగార్బొగుడ తండాల్లో సీసీరోడ్డు పనుల విషయంలో జరిగిన గొడవ కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్త వడిత్య శ్రీనివాస్పై దాడి చేసి హత్యచేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. శ్రీనివాస్ను పంచాయతీ పేరుతో పిలిచి దాడికి పాల్పడడంతో దవాఖానకు తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడన్నారు. కొన్ని రోజుల క్రితం బాణాపూర్ మాజీ సర్పంచ్ భర్త చన్బసప్పపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో బలమైన గాయాలయ్యాయన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఇటువంటి ఘటనలు జరుగకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించే విధంగా కృషి చేశానన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిగా సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు దుశ్చర్యలు ఆపకపోతే ప్రతిచర్య తప్పదని హంచ్చరించారు. నారాయణఖేడ్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు భూపాల్రెడ్డి కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నారాయణఖేడ్ మండల అధ్యక్షుడు పరమేశ్, పెద్దశంకరంపేట జడ్పీటీసీ విజయరామరాజు, నాయకులు రవీందర్నాయక్, నజీబ్, బాసిత్, ముజామిల్ పాల్గొన్నారు.