మెదక్/ సంగారెడ్డి జిల్లా నెట్వర్క్, ఆగస్టు 2 : శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలు, పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలతో అభిషేకం చేసి, పాలుపోశారు.
అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ పట్టణంలోని మల్లం చెరువు కట్టపై ఉన్న పుట్ట వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కౌన్సిలర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేసి, పుట్టలో పాలు పోశారు. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీ నాగులమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆయన సతీమణి యాదమ్మతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
పటాన్చెరులో నాగదేవతకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దంపతులు