మెదక్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ముదిరాజ్ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని, భవిష్యత్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం మెదక్లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఆత్మగౌరవ భవనాలకు ఉమ్మడి మెదక్ జిల్లా వేదిక అయ్యిందన్నారు. ఇప్పటికే జహీరాబాద్, సంగారెడ్డి, గజ్వేల్, సిద్దిపేటలో ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. సమాజంలో ముందుకు సాగేందుకు ఈ ఆత్మగౌరవ భవనాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలనలో చెరువుల బోరేసి నీళ్లు తీసుకున్న రోజుల నుంచి ఇప్పుడు చెరువుల్లో నీళ్లు ఎక్కువయ్యాయన్నారు. చేపలు అడుగుకు పోయాయని, నీళ్లు తీయించాలని అడిగే రోజులు వచ్చాయని అన్నారు. తెలంగాణలో మత్స్యకారుల సంఘంలో నాలుగున్నర లక్షల మందికి సభ్యత్వం నమోదైందని, ఇంకా 2 లక్షల మందికి సభ్యత్వం ఇప్పించే అవకాశం ఉందన్నారు. ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాశ్కు అవకాశం కల్పించారని, ముదిరాజ్లకు తెలంగాణ ప్రభుత్వం తగిన గౌరవాన్ని ఇస్తున్నదని తెలిపారు. భవిష్యత్లో ఈ వర్గం నుంచి ఎమ్మెల్యేలు రావాలని కోరుకుంటున్నానన్నారు. మీ తోడుతో మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.