అందోల్, జనవరి 29 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి విజయఢంకా మోగించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. సోమవారం అందోల్ మండలం సంగుపేటలోని ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అందోల్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు. తెలంగాణ తెచ్చి, రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీగా బీఆర్ఎస్కు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నదని, దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి లబ్ధి పొందిందని, ఆ పార్టీని గెలిపించినందుకు ప్రజలు ఎంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు, రైతులతో పాటు ప్రతి ఒక్కరికీ కష్టాలు మొదలయ్యాయని, కరెంట్ కోతలు, నీటి కష్టాలు ఇతర అంశాలను ఇంటింటికీ వివరించాలన్నారు. కేసీఆర్ లేని ప్రభుత్వంలో అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని, అన్ని వర్గాలు పశ్చాతాప పడుతున్నారని వారిని కలిసి భరోసా కల్పించాలన్నారు. కాంగ్రెస్-బీజేపీలు అధికార కాంక్షతో పనిచేస్తున్నాయని, అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి బీఆర్ఎస్కు పట్టం కట్టాలన్నారు.
ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత పదేండ్లుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటిని చూసే ప్రజలు మరోసారి పట్టం కడతారన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీజైపాల్రెడ్డి అన్నారు. బేషాజాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదేనన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ అందోల్ నుంచి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ అందించాలన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఓడినా గెలిచినా నిత్యం ప్రజల మధ్యే ఉంటామని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ఒక్కటేన్నారు. అనంతరం నియోజకవర్గంలోని సర్పంచ్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో స్టేట్ ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు సంజీవయ్య, మల్లికార్జున్, రజినీకాంత్, జోగినాథ్, నారాయణ, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, నాయకులు రాహుల్ కిరణ్, ఉదయ్ బాబూమోహన్, లింగాగౌడ్, కాశీనాథ్, వీరభద్రరావు, శ్రీధర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.