రామాయంపేట రూరల్, డిసెంబర్ 7 : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు, అవి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్ముడు అన్న మాట. నేడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి తడి,పొడి చెత్తను వేరు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటా ప్రభుత్వం అందజేసిన చెత్త బుట్టల్లో తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని గ్రామస్తులకు వివరించారు. ఈ చెత్తను గ్రామ పంచాయితీ ట్రాక్టర్ల ద్వారా వేరువేరుగా చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో మురుగు కాల్వల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్ కవర్లు లేకపోవడంతో పరిశుభ్రంగా మారాయి. గతంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడంతో దోమలు విపరీతంగా పెరిగి, దుర్వాసన వెదజల్లేది. కానీ, నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. రామాయంపేట మండలంలో మొత్తం 15 డంపింగ్ యార్డులు నిర్మించి, ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు.
వేరు చేయడంతో ఉపయోగాలు
తడి చెత్తను వేరు చేయడంతో అనేక లాభాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తడి చెత్త అనగా, మిగిలిన అన్నం, కూరగాయలు, ఆకు, చెత్తాచెదారం వంటి తడి చెత్తను డంపింగ్యార్డులో వేయడంతో వర్మీ కంపోస్టు తయారు చేయొచ్చు. ఈ వర్మీ కంపోస్టు ఎరువులను రైతులకు విక్రయించొచ్చు. ఫలితంగా గ్రామ పంచాయతీలకు అదనపు లాభం వస్తుంది. పొడి చెత్త అనగా ప్లాస్టిక్, అట్టలు వంటి వస్తువులు రీసైక్లింగ్ చేయడానికి వీలుంటుంది. దీంతో కూడా అనేక లాభాలు ఉన్నాయి.
పరిశుభ్రంగా గ్రామాలు..
ఒకప్పుడు గ్రామాలు మురుగు మయంగా మారి ఆధ్వానంగా ఉండేవి. కానీ నేడు ప్రభుత్వం డంపింగ్యార్డులు ఏర్పాటు చేసి చెత్తను ఇంటి వద్దకు వచ్చి తీసుకెళ్లడంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. దీంతో గ్రామంలో మురుగు కాల్వల్లో నీరు నిల్వలేకపోవడంతో, దోమల బెడద తీరింది.
-పంబాల జ్యోతి, జాన్సీలింగాపూర్ సర్పంచ్
మంచి నిర్ణయం..
గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మించి తడి,పొడి చెత్తను వేరుగా తరలించడం మంచి నిర్ణయం. ఈ విధంగా గ్రామం అవుతుందని ఎప్పుడు ఊహించలేదు. ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయితీ కార్మికులు వచ్చి చెత్తను తీసుకెళ్తున్నారు. కాలనీలో కూడా ఎక్కడ పారిశుధ్యం లోపించడం లేదు. గ్రామం పరిశుభ్రంగా మారింది.