తల్లి పాలు బిడ్డకు అమృతం. బిడ్డకు ముర్రుపాలు పట్టించడంతో వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. బిడ్డ రోగాల బారిన పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. పుట్టిన బిడ్డకు తల్లి పాలుపడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పసి పిల్లలకు అమృతం వంటి తల్లిపాలు, వాటి విశిష్టతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నది. క్షేత్ర స్థాయిలో ఏడు రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నారు.
అక్కన్నపేట/అల్లాదుర్గం,ఆగస్టు 2 : అమృతంతో సమానమైన తల్లిపాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళల్లో అవగాహన కల్పించేందుకు తల్లిపాల వారోత్సవాల పేరిట ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. తల్లిపాలు రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి.. బిడ్డకు పాలు ఇవ్వడంతో తల్లీబిడ్డకు కలిగే ప్రయోజనాలు.. ఎలాంటి ఆహరం తీసుకోవాలి.. తదితర విషయాలను వివరిస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత అర గంటలోపు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ఇవి శిశువుకు కచ్చితంగా పట్టాలి. తద్వారా రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటు సమతుల ఆహారం అందుతుంది. వీటిలో మాంసకృత్తులు, విటమిన్-ఏ ఉంటుంది. బిడ్డకు వ్యాధులు రాకుండా జీవితకాలం కాపాడుతాయి. శిశువు పేగులను శుభ్రం చేసి మల, మూత్ర విసర్జనకు తోడ్పతాయి. ఆరునెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా ప్రతిరోజు మూడు నుంచి పది సార్లు తల్లిపాలు ఇవ్వాలి.
తల్లి పాలతో బిడ్డకు కలిగే ప్రయోజనం
తల్లిపాలతో బిడ్డకు ప్రోటీన్లు అంది మెదడు వికసించడంతో పాటు శిశువు సమత్యులమైన ఆహా రం అందుతుంది. తల్లిపాలతో బిడ్డకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లిపాలలో లాక్టోజ్ ఉండటంతో క్యాల్షియం నిల్వలు పెరుగుతాయి. దీంతో బిడ్డ రక్తహీనత బారినపడకుండా కాపాడతాయి. తొలిదశలో శిశువుకు వివిధ రకాల అంటువ్యాధుల బారి నుంచి కాపాడడమే కాకుండా మనోవికాసానికి తోడ్పడతాయి. నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడవచ్చు. క్యాన్సర్, గుండెజబ్బులు, చెవికి సంబంధించిన వ్యాధుల నుంచి రక్షణనిస్తాయి. అస్తమా, ఎలర్జీ, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
తల్లికీ కలిగే ప్రయోజనాలు..
బిడ్డకు తల్లి ముర్రుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. భవిష్యత్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు, మధుమేహం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జీవితాంతం ఆర్యోగంగా ఉంటారు. ఊబకాయం వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. గర్భానికి పూర్వం ఉండే బరువును మళ్లీ పొందవచ్చు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువల ఉన్న ఆహారం తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు..
బిడ్డకు సరిపడా తల్లిపాలు ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రోటీన్లు ఉండే పాలు, చేపలు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. దీనివల్ల బిడ్డకు సరిపడే తల్లిపాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి.
– నాగమణి, అంగన్వాడీ సూపర్వైజర్, అల్లాదుర్గం
గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తాం..
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏడు రోజుల పాటు తల్లి పాల అవశ్యతకపై గర్భిణలు, బాలింతలకు అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వివరిస్తాం. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. సాంస్కృతిక కళాకారులతో తల్లిపాలపై ఆటపాటల రూపంలో అవగాహన కల్పిస్తాం.
– జయమ్మ, సీడీపీవో, హుస్నాబాద్
పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టాలి..
బిడ్డ పుట్టిన అరగంట లేదా గంటలోపు కచ్చితంగా ముర్రుపాలు పట్టించాలి. ఆరు నెలలు తల్లిపాలు పట్టడంతో బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరగుతుంది. ముర్రు పాలపై తల్లుల్లో మరింత అవగాహన అవసరం. గర్భం దాల్చి దవాఖానకు వచ్చే ప్రతి మహిళకు తల్లిపాల అవశ్యకత గురించి వివరిస్తాం.
– డాక్టర్ సౌమ్య, వైద్యురాలు, హుస్నాబాద్ దవాఖాన
తల్లిపాలు తొలి ఆరోగ్య టీకా..
బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టాలి. ఈ పాలు బిడ్డకు తొలి ఆరోగ్య టీకాగా పనిచేస్తాయి. బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్, ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. బిడ్డకు రోజుకు 8 నుంచి 12 సార్లు తల్లి పాలు ఇవ్వాలి. తల్లిపాలు సంజీవనిలా పనిచేస్తాయి. దీంతో పాటు తల్లి,పిల్లలకు ఇద్దరికీ మంచిది. తల్లిపాల ఆవశ్యకతను ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
– దివ్యజ్యోతి, వైద్యాధికారి, అల్లాదుర్గం