నారాయణఖేడ్లో 1,16,295 ఎకరాల నుంచి 2,06,519కి పెరిగిన పంటల విస్తీర్ణం
ఎనిమిదేండ్లలో రెట్టింపైన సాగుబడి
వ్యవసాయంపై రైతుల్లో పెరిగిన ఆసక్తి
పంట పొలాలుగా మారిన బీడు భూములు
నాడు వలసలు.. నేడు ఉపాధికి బాటలు
సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న అన్నదాతలు
నారాయణఖేడ్ నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు
దశాబ్దం క్రితం వరకు కరువుతో వలసబాట పట్టిన నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులు నేడు ఇతర రాష్ట్ర కూలీలకు ఉపాధి చూపిస్తున్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని పండుగలా మార్చాయి. రైతుబంధు, మిషన్భగీరథ, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంట్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం బీడు భూములకు ప్రాణం పోశాయి. 2014లో 1,16,295 ఎకరాలు సాగులో ఉండగా, 2022 నాటికి 2,06,519 ఎకరాలకు చేరింది. భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో బసవేశ్వర ఎత్తిపోతలను వీలైనంత త్వరలో నిర్మించి, మరో 1.65లక్షల ఎకరాలను నీళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. నాగల్గిద్ద, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో మరో ఎనిమిది కొత్త చెరువుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నది. ఒకప్పుడు కేవలం 3వేల ఎకరాల ఆయకట్టుకే పరిమితమైన నల్లవాగు ప్రాజెక్టును 6060 ఎకరాలకు పెంచేందుకు రూ.24.19 కోట్లతో ఆధునీకరించే పనులు జోరుగా సాగుతున్నాయి.
బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్(ఫైల్)
నారాయణఖేడ్, జూలై 8 : సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ అంటే వ్యవసాయపరంగా వెనుకబడిన ప్రాంతం. భూగర్భ జలాల కొరత, సాగునీటి వనరుల లేమి వెరసి వ్యవసాయం చేయడమంటే సాహసం చేసినంత పని. వర్షాధార పంటలను మాత్రమే నమ్ముకుని పంటలను సాగు చేసే పరిస్థితుల్లో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులు రైతుల ఆశలపై నీళ్లు చల్లడంతో చేసేదేమీ లేక వ్యవసాయాన్ని చాలించాల్సిన పరిస్థితి. భూస్వాములు సైతం అస్త్ర సన్యాసం చేయాల్సిన అనివార్యత. ఫలితం పంటలతో కళకళలాడాల్సిన భూములు పడావుగా మారిన ధైన్యం. ఈ కారణంతోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే వలసలకు పెట్టింది పేరుగా నారాయణఖేడ్ ప్రాంతం మారింది. ఇదంతా గతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయానికి పెద్దపీట వేసింది. రైతులను వలసల నుంచి వ్యవసాయం వైపు మళ్లించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు దోహదం చేశాయని చెప్పవచ్చు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2014లో ఉన్న సాగుభూమితో పోల్చితే ఇప్పుడు సాగు విస్తీర్ణం రెట్టింపైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టు, కొత్త చెరువుల నిర్మాణం వంటి పనులు పూర్తైన పక్షంలో ఇక్కడి రైతులకు మంచి రోజులు ఎక్కువ దూరంలో లేవనేది నిస్సందేహం.
నారాయణఖేడ్ వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో సమైక్య రాష్ట్రంలో, ఇప్పుడున్న సాగుతో పోల్చితే సాగు విస్తీర్ణం దాదాపు రెట్టింపు స్థాయిలో పెరిగిందని చెప్పవచ్చు. టీఆర్ఎస్ సర్కార్ అధికారం చేపట్టిన ఎనిమిదేండ్లలో ఇంతలా ఎవుసం ఎదిగిందంటే దీనికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, అమలు చేస్తున్న పథకాలు అని చెప్పవచ్చు. సాగు విస్తీర్ణంపై ప్రభుత్వ లెక్కలను ఒకసారి బేరీజు వేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరంభంలో అంటే 2014లో 1,16,295 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 2021-22లో 2,06,519 ఎకరాలకు విస్తరించింది. పెరిగిన సాగు విస్తీర్ణం 90,224 ఎకరాలుగా అధికారుల లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. ఇక మండలాల వారీగా నారాయణఖేడ్ మండలంలో గతంలో ఉన్న 29,160 ఎకరాల సాగు విస్తీర్ణం ప్రస్తుతం 44,533 ఎకరాలకు పెరగగా, కంగ్టి మండలంలో గతంలో 33,698 ఎకరాలు కాగా, ప్రస్తుతం 54,478 ఎకరాలు, అప్పుడున్న ఉమ్మడి కల్హేర్ మండలంలో గతంలో సాగు విస్తీర్ణం 10,027 ఎకరాలుగా ఉండగా, ప్రస్తుతం వేర్వేరు మండలాలుగా ఉన్న కల్హేర్, సిర్గాపూర్ మండలాల సాగు విస్తీర్ణం 44,439 ఎకరాలకు పెరగడం విశేషం. అదేవిధంగా అప్పటి ఉమ్మడి మనూరు మండలంలో సాగు విస్తీర్ణం 43,410 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం ఉన్న మనూరు, నాగల్గిద్ద మండలాల సాగు విస్తీర్ణం కలిపి 63,066 ఎకరాలకు పెరిగింది.
నవశకానికి ముందడుగు
నారాయణఖేడ్ నియోజకవర్గంలో వ్యవసాయరంగంలో ఏ మేరకు మార్పులు జరిగాయంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు, తర్వాత అని బేరీజు వేసుకునే స్థాయిలో, గతంలో వలస పీడిత ప్రాంతంగా ఉన్న నారాయణఖేడ్ ప్రాంతం నుంచి క్రమేణా వలసలు తగ్గిపోవడమే కాకుండా పత్తి తెంపే పనులకు, వరి నాట్లు వేసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల నుంచి ఇక్కడికి రావడం ఎవుసం ఎదిగిన తీరుకు నిదర్శనం. ప్రతికూల పరిస్థితుల మధ్య వ్యవసాయం చేయలేని స్థితిలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే గడ్డు పరిస్థితులను అధిగమించి రైతాంగం ఇప్పుడిప్పుడే నవశకం వైపు అడుగులేస్తుండడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. నియోజకవర్గంలో 46 కిలోమీటర్ల మేర మంజీరా నది ప్రవహిస్తున్నా సాగునీటి వినియోగానికి నోచుకోని పరిస్థితి ఉండగా, అదే మంజీరా నదిని నియోజకవర్గ రైతుల పాలిట వరప్రదాయినిగా మార్చే దిశగా కేసీఆర్ ప్రభుత్వం బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ఏకంగా 1.65 లక్షల ఎకరాల భూములకు సాగునీటిని మళ్లించే భగీరథ కార్యానికి నాంది పలికిన విషయం తెలిసిందే. నాగల్గిద్ద, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో మరో ఎనిమిది కొత్త చెరువుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నది. సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కేవలం 3 వేల ఎకరాలకు పరిమితమైన నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టును పూర్తిస్థాయి 6,060 ఎకరాలకు స్థిరీకరించే దిశగా రూ.24.19 కోట్ల నిధులతో ప్రాజెక్టు ఆధునీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించే నవశకానికి ముందడుగు పడుతుందనేది నిస్సందేహంగా చెప్పవచ్చు.
పెరిగిన నీటిపారుదల విస్తీర్ణం
ఒకప్పుడు గుక్కెడు తాగునీటి కోసం పరితపించిన ఈ ప్రాంతం, చెరువులు, కుంటలు, బోరుబావులపై ఆధారపడి గుడ్డిలో మెల్ల అనే చందంగా వ్యవసాయాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి. మధ్యతరహా సాగు నీటి ప్రాజెక్టు సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు ఉన్నప్పటికీ, దాని నీటిపారుదల సామర్థ్యం కేవలం 6,060 ఎకరాలు మాత్రమే. ఇక రైతులకు చెరువులు, కుంటలు, బోరు బావులు మాత్రమే సాగునీటి వనరులుగా ఉపకరిస్తున్నాయి. కంగ్టి, ఉమ్మడి మనూరు మండలాల్లో నామమాత్రంగా ఉన్న చెరువుల కారణంగా వర్షాధార పంటలే పెద్ద దిక్కయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చి నియోజకవర్గంలో నీటి పారుదల విస్తీర్ణంలో గణనీయమైన వృద్ధిచెందింది. 2014 వరకు నీటిపారుదల విస్తీర్ణం కేవలం 13,984 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 2021-22కు గణాంకాలను పరిశీలిస్తే 39,488 ఎకరాలకు పెరిగి నీటిపారుదల విస్తీర్ణం ఊహించని రీతిలో పురోగతి సాధించింది. అదనంగా మరో 20,596 ఎకరాలు ఆరుతడి పంటలు పండించినట్లు అధికారిక లెక్కలు చెబున్నాయి. ఇందుకు దోహదం చేసిన అంశాలపై దృష్టి సారిస్తే, ముఖ్యంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.80 కోట్లతో నియోజకవర్గంలోని చెరువుల పునరుద్ధరణ, 24 గంటల విద్యుత్ సరఫరా, అవసరం మేరకు అందుబాటులోకి ఎరువులు, విత్తనాలు, వీటికి తోడు విస్తారంగా వర్షాలు కురవడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. మరోవైపు వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రైతుబంధు పథకంతో పాటు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, యాంత్రిక వ్యవసాయానికి ప్రోత్సాహం వంటి అంశాలు కూడా వ్యవసాయంతో పాటు సాగునీటి ఆయకట్టుకు జీవం పోశాయి.
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
కుంటుపడుతున్న వ్యవసాయాన్ని నిలబెట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి పెరిగిన సాగు విస్తీర్ణమే నిదర్శనం. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవడం వల్లే ఎనిమిదేండ్లలో నియోజకవర్గంలో సాగువిస్తీర్ణం పెరిగింది. చాలీచాలని స్థాయిలో భూములున్న చిన్న రైతులు ఒకప్పుడు తమ భూములను పడావు వేసి వ్యవసాయకూలీలుగానో లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడమో చేయక తప్పని దుస్థితి నుంచి ఇప్పుడు స్వతహాగా వ్యవసాయం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు పొలం పనుల కోసం మా ప్రాంతానికి వలస వస్తుండడాన్ని గొప్ప మార్పుగా భావిస్తున్నా.
– మహారెడ్డి భూపాల్రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే
అనుకూల పరిస్థితులే కారణం
వ్యవసాయంపై రైతుల్లో రోజురోజుకూ అవగాహన పెరుగుతుండడంతో సహజంగానే పంట సాగుపై వారు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆధునిక వ్యవసాయక పద్ధతులను పాటించడం, యాంత్రిక వ్యవసాయం వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో వ్యవసాయమనేది రైతులకు సులభతరమైంది. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, అవసరమైన మేరకు అధికారుల సహకారం అందుతుండడం కూడా సాగు విస్తీర్ణం పెరిగేందుకు కారణమనే చెప్పాలి.
– కరుణాకర్రెడ్డి, ఏడీఏ నారాయణఖేడ్