సువిశాల దేశంలో అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ రంగాన్ని కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, ప్రజల ఆహార అవసరాలు తీర్చే రంగంగా, ఒక సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం భావించాలి. వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలి. కానీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పైగా వ్యవసాయ రంగంపై వివక్ష చూపిస్తున్నది. ఉపాధి హామీ పథకం నిధులతో తెలంగాణలో నిర్మించిన రైతుల కల్లాలపై వివక్ష చూపడమే ఇందుకు నిదర్శనం.
తనను బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ 2013 సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో దేశంలోని 540 జిల్లాలు, 200 కంపెనీలు, 15 దేశాల ప్రతినిధులు, 10 వేల మంది రైతులతో ‘ద వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ అగ్రికల్చర్ సమ్మిట్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల ఉత్పాదకత, రైతుల ఆత్మహత్యలు, రైతులకు రుణాలివ్వడంలో బ్యాంకుల వివక్ష, పంటలకు గిట్టుబాటు ధరల గురించి మాట్లాడారు. పప్పులలో ప్రోటీన్ శాతం గురించి, ఉల్లి గడ్డల కొరత గురించి మాట్లాడారు. పంటల మార్కెటింగ్ విషయంలో రాష్ర్టాల మధ్య సమన్వయం, సంబంధాలు లేవని; విశ్వవిద్యాలయాలు, ప్రధాని కార్యాలయానికి సంబంధాలు ఉండాలని అన్నారు. దేశంలో గోదాముల కొరత తీవ్రంగా ఉందని, ఉత్పత్తుల సేకరణ, రవాణా, నిల్వలకు సంబంధించి ఎఫ్సీఐ వికేంద్రీకరణ జరగాలని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల మీద కేంద్రానికి అస్సలు ప్రణాళిక లేదని, అవసరం ఉన్నప్పుడు దిగుమతుల కోసం ఎగబడుతున్నామని అన్నారు.
2014, 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోల్లో అధికారంలోకి వస్తే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటిస్తామని, 60 ఏండ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతుకు పింఛను ఇస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేర్ హౌసింగ్ గోదాములు నిర్మిస్తామని, దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని, వ్యవసాయ రంగంలో రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని హామీలు గుప్పించారు.
అంతేకాదు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గొప్పగా ప్రకటించారు. ఇన్ని హామీలు, వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. తెలంగాణలో రైతు బంధు పథకానికి వచ్చిన ఆదరణ చూసి కేంద్రం ఆర్భాటంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను ప్రవేశపెట్టింది. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి మూడు విడతల్లో మొత్తం రూ.6 వేలు ఇస్తామని గొప్పగా చెప్పింది. కానీ సవాలక్ష కొర్రీలతో 2019లో తొలి విడతలో 11.84 కోట్ల మందికి ఈ పథకం వర్తింపచేసింది. 2022 నాటికి ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను 3.87 కోట్లకు కుదించింది. కేవలం మూడేండ్లలో 8 కోట్ల మంది లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నది.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2017లో సుమారు 8 నెలలపాటు తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఎలుకలను కొరికి, మలాన్ని తిని, పుర్రెలు, ఎముకలు ధరించి రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపి తమ గోడు పట్టించుకోవాలని విన్నవించుకున్నా మోదీ సర్కారు పట్టించుకోలేదు. దీంతో దయనీయ పరిస్థితుల్లో వారు తిరిగి వెళ్ళిపోయారు. 2018లో మహారాష్ట్ర రైతులు రైతు రుణ మాఫీ, ఉచిత విద్యుత్తు, కనీస మద్దతు ధర కొరకు డిమాండ్ చేస్తూ నాసిక్ నుండి ముంబై వరకు 180 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో వృధ్ధ రైతులు, మహిళా రైతుల హృదయ విదారక దృశ్యాలు చూసి దేశమంతా చలించింది. అయినా కేంద్ర ప్రభుత్వ మనసు కరిగింది లేదు… రైతులకు ఒరిగింది లేదు. కేంద్ర ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని దిగ్భంధించిన లక్షల మంది రైతులు 2020, 2021లో 16 నెలల పాటు ఆందోళన చేశారు. చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ 750 మంది పైచిలుకు రైతులు ఆ ఆందోళనలో మరణించారు. రైతులపై పోలీసులు వాటర్ క్యాన్లను, భాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. లాఠీ ఛార్జీ చేశారు. రైతులపై ఖలిస్థాన్ ఉగ్రవాదులని ముద్ర వేశారు. అయినా రైతులు పట్టుదలగా ఉద్యమం కొనసాగించడంతో చివరకు కేంద్ర ప్రభు త్వం తలొగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పంటలకు కనీస మద్దతు ధర విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చి రైతుల ఆందోళన విరమింపజేశారు. కానీ ఏడాది గడిచినా ఆ హామీ అమలు విషయంలో ఉలుకూ పలుకూ లేదు. కేంద్రం నిజంగా రైతుల బాగోగులు పట్టించుకుని ఉంటే, ఏడాదిగా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉంటున్నది?
మన దేశంలో అపారమైన సహజ వనరులున్నాయి. కానీ ఇప్పటివరకు దేశ పాలకులకు వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయంలో స్పష్టత ఉన్నట్లు లేదు. అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా, దాన్ని అందిపుచ్చుకోలేని పరిస్థితి దేన్ని సూచిస్తున్నది? 75 ఏండ్లుగా కేంద్ర పాలకుల నిర్వాకమే నేటి వ్యవసాయ రంగ సమస్యలకు కారణం. సాగునీరు, విద్యుత్తు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, మద్దతు ధరలు, మార్కెటింగ్ వసతులు… ఇలా ఏ విషయంలోనూ రైతు, వ్యవసాయ అనుకూల నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలు, నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్ల రైతులు వ్యవసాయం చేయడం కష్టంగా మారుతున్నది. పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోవడం, ఆదాయం ఆ మేరకు పెరగకపోవటం మూలంగా దేశ వ్యాప్తంగా సాగు ఏ మాత్రం లాభసాటి కానిదిగా రైతులు భావిస్తున్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దార్శనిక దృష్టితో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు 24 గంటల ఉచిత కరెంట్, ఉచిత సాగునీరు, ఏడాదికి ఎకరాకు రూ.10 వేల రైతుబంధు సాయం, రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే అతడి కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా సాయం, విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వంద శాతం పంటలు కొనుగోలు చేసి అన్నదాతల్లో ఆత్మ స్థైర్యం పెంచుతున్నది. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తుండడంతో పడావు పడ్డ భూములన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి యువతరాన్ని సైతం సేద్యం వైపు ఆకర్షిస్తున్న ఘనత కేసీఆర్ పాలనది. ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ప్రభుత్వానిది తండ్రి లాంటి బాధ్యత. పత్యేకంగా ఏర్పాటు చేసిన మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ద్వారా రైతుల పరిస్థితి, పంటల సాగు, దిగుబడులు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ఆహార అవసరాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సాంప్రదాయ సాగులో పడి నష్టపోతున్న రైతాంగాన్ని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నది.
భూసార పరిస్థితులు, నేల రకాలు, వ్యవసాయానికి అవసరమైన వివిధ రకాల వనరులు, వాతావరణ పరిస్థితులు, స్థానిక భౌగోళిక పరిస్థితులు, రైతుల ఆర్థిక స్థితిగతులు, చిన్న కమతాలలో సాగు వంటి సమస్యలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న సాంకేతికతను వ్యవసాయానికి జోడించడం, సాగు పెట్టుబడులు తగ్గించడం, పంటల ఉత్పాదకతను పెంచడం తద్వారా రైతుల ఆదాయం పెంచడం, అంతిమంగా వ్యవసాయాన్ని లాభదాయకం చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. నేల ఆరోగ్యాన్ని కాపాడటం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం లాంటి దీర్ఘ కాలిక లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. 2014 నాటికి 1 కోటీ 34 లక్షల ఎకరాలుగా ఉన్న వ్యవసాయ సాగు విస్తీర్ణం సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా 2021 నాటికి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014 నాటికి 45 లక్షల టన్నులుగా ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి 2021 నాటికి దాదాపు 3 కోట్ల టన్నులకు చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలితో అల్లాడిన తెలంగాణ ఏడేండ్లలో దేశానికే అన్నపూర్ణ అయిన పంజాబ్ను మించి వరి ధాన్యం దిగుబడులు సాధించింది. ఫలితంగా 2014-2015 నుంచి 2021-22 మధ్య తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 11.6 శాతంగా నమోదైంది. 2014-2015 నుంచి 2021-22 మధ్య వ్యవసాయ రంగం ద్వారా వచ్చే స్థూల ఆదాయం విలువ 16.3 శాతం నుంచి 18.3 శాతానికి పెరిగింది.
గత ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం, సాగునీటి రంగం మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందులో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేకపోవడం గమనార్హం. గత 9 విడతల్లో రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.58 వేల కోట్లను జమ చేసింది. సుమారు రూ.1.50 లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది.
ఏడాదికి 10,500 కోట్లు ఉచిత విద్యుత్ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. కానీ కేంద్రం తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రతి పనికి అడ్డంకులు సృష్టిస్తున్నది. మొదట వరి పంట సాగు వద్దన్నది. తర్వాత ఫలానా రకం వడ్లే కొంటామని పేచీ పెట్టింది. ఆ తర్వాత ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.. మేము కొనమంది. ఆ తర్వాత ధాన్యం నిల్వలు కరిగిపోయాయని చెప్పి ధాన్యం ఎగుమతుల మీద ఆంక్షలు విధించింది.
ఏటా పంటలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటున్నది. పండిన పంటలో కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నది. దీంతో రైతులు గిట్టుబాటు ధర దక్కక నష్టాల పాలవుతున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నష్టాలను భరిస్తూ వంద శాతం పంటల కొనుగోళ్లను చేపడుతున్నది. ఎనిమిదేండ్లలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా ఎదుగుతున్న తెలంగాణ వంటి రాష్ర్టానికి చేయూతనివ్వాల్సిన కేంద్రం అన్ని విషయాల్లో అడ్డంకులు సృష్టించి వేధిస్తున్నది. తాజాగా ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో నిర్మించిన రైతుల కల్లాల విషయంలో వివక్ష చూపుతూ దాని కోసం వెచ్చించిన రూ.151 కోట్లు వెనక్కు ఇవ్వాలని కోరుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపైన ఉన్న వ్యతిరేకతకు పరాకాష్ఠ.
బీజేపీ కేంద్రంలో అధికారం దక్కించుకోవడానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. వ్యవసాయ విధానాల గురించి, రైతుల సంక్షేమం గురించి అధికారంలోకి రాక ముందు అనేక విషయాలు చెప్పిన బీజేపీ, అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు కావస్తున్నా దేశానికి ఒక స్పష్టమైన వ్యవసాయ విధానం రూపొందించకపోవడం విషాదం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, రైతాంగ అనుకూల పథకాలు, విధానాలు ఈ దేశమంతా అమలు కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకే ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ దేశానికి అత్యవసరం.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి)
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి