మెదక్, నవంబర్ 12 : ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే డిసెంబర్ 16 వరకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని మెదక్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.హరీశ్ కోరారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన మండలికి ఉమ్మడి మెదక్ జిల్లాలో జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. కాగా, మొత్తం 1,062 ఓటర్లకు గాను 47 ఖాళీలు పోగా, 1,015 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మెదక్ జిల్లాలో 279, సిద్దిపేట జిల్లాలో 258 మంది, సంగారెడ్డి జిల్లాలో 478 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వివరించారు. ఓటర్ల జాబితాను పరిశీలించేందుకు అదనపు కలెక్టర్ రమేశ్ను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎన్నికల కమిషన్ నియమించిందని తెలిపారు. వీరు ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 15న ప్రకటిస్తారని, దీనిపై ఈ నెల 20 వరకు అభ్యంతరాలు, ైక్లెమ్స్ స్వీకరించి, 21, 22 తేదీల్లో స్క్రూట్నీ చేసి 23న తుది జాబితాను ప్రకటిస్తారని కలెక్టర్ వివరించారు.
ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్..
మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 16 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 24న నామినేషన్ల పరిశీలన, 26లోపు ఉపసంహరణ ఉంటుందని కలెక్టర్, ఎన్నికల అధికారి హరీశ్ అన్నారు. డిసెంబర్ 10న పోలింగ్కు సం గారెడ్డిలోని టీఎన్జీవో భవనం, మెదక్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, సిద్దిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నా రు. డిసెంబర్ 14న మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. ఉద యం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని, అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలకు 500 కంటే అధికంగా ప్రజలు హాజరుకావొద్దని, బైక్, కార్ల ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, సభలు, సమావేశాలకు ఇక్కడి నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ఖర్చులకు సంబంధించి కొత్తగా తీసిన బ్యాంకు ఖాతా నంబర్ ఇవ్వాలని, సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, టీఆర్ఎస్ పార్టీ నుంచి దేవేందర్రెడ్డి, బీజేపీ నుంచి ఉదయ్కిరణ్, సీపీఐ నుంచి జిల్లా కార్యదర్శి ఖాలిక్, బీఎస్పీ నుంచి నాగరాజు, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, మైన్స్ ఏడీ జయరాజ్, డీఎస్వో శ్రీనివాస్, బీసీ సంక్షేమాధికారి జగదీశ్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి కృష్ణమూర్తి, ఆర్డీవో సాయిరాం, కలెక్టరేట్ ఏవో యూనుస్ పాల్గొన్నారు.