తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మన భూములు బంగారమయ్యాయని ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్గౌడ్తో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల ప్రజలు ఇక్కడ భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేయడం, తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని చెప్పడం మనం సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. అందరం కలిసికట్టుగా కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో 105 సీట్లతో ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం ముంగి గ్రామ శివారులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ సర్కారు రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదన్నారు. విద్య,వైద్య రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.
మనోహరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల ప్రజలు, రైతులు తెలంగాణలో భూములు కొని వ్యవసాయం చేయడం, తమ ప్రాంతాలను కూడా తెలంగాణాలో కలపాలని డిమాండ్ చేయడం తెలంగాణ సాధించిన అభివృద్ధికి నిదర్శనమని సిద్దిపేట జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని శుభం గార్డెన్స్లో మనోహరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్గౌడ్, మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డిలతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ఎలా ఉండేది, నేడు ఎలా ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నామని, నాడు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, అప్పుడు కరెంటు వస్తే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అని అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, గతంలో ట్రాన్స్ఫార్మర్లు, బాయికాడ మోటార్లు కాలిపోయి వచ్చీరాని కరెంటుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. తెలంగాణలో అందిస్తున్న సంక్షేమ పథకాలు యావత్ భారతదేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ప్రధాని కావడం ఖాయమన్నారు. నాయకులు బేషజాలు వీడి కలిసి కట్టుగా ఉండాలన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి మాట్లాడుకోవడం ఆనందంగా ఉందన్నారు. మనోహరాబాద్ మండలంలోని పంచాయతీలకు నాలుగు అవార్డులు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు రూ. 2 వేలు పింఛన్ తీసుకుని సీఎం కేసీఆర్ తమ పెద్దకొడుకు అని దీవిస్తున్నారన్నారు. ఇవాళ ఏ ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికార పార్టీకి 75 శాతం సీట్లు వస్తే, ప్రతిపక్షాలకు 25 శాతం సీట్లు వచ్చే పరిస్థితి ఉండేదని, కానీ, నేడు ప్రతి ఎన్నికల్లో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సేవ చేస్తూ, అవినీతి రహిత పాలన సాగించడతోనే ఇది సాధ్యమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. ఇవాళ 60 లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ అజేయ శక్తిగా నిలిచిందని, అందరూ కలిసి కట్టుగా శ్రమిస్తే వచ్చే ఎన్నికల్లో 105 సీట్లతో బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించడం ఖాయమన్నారు. మీరు వేసిన ఓట్లతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని, ఆ క్రెడిట్ అంతా మీకే దక్కుతుందన్నారు. గ్రామ చావిడిల వద్ద, సోషల్ మీడియా వేదికల ద్వారా మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకున్నామని, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయబావుటా ఎగరేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిత్యావసర ధరలు పెంచి నిరుపేదలపై బీజేపీ ప్రభుత్వం భారం మోపుతున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ పతనమైపోయిందన్నారు. చీటికీమాటికి ఉప్పు, పప్పులు, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజల నడ్డివిరుస్తున్నదన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఇతర రాష్ర్టాల సీఎంలు అమలు చేస్తున్నారన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. యాదవులు, ముదిరాజ్లు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధిలోకి వస్తున్నారన్నారు. నేడు తెలంగాణ పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు దక్కించుకున్నాయన్నారు. గ్రామాల్లో ప్రజలు చైతన్యం కావాలని, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజాబలం ఉందని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఓ గొప్ప విజన్ ఉన్న నేతగా సీఎం కేసీఆర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయంటే ఇక్కడ ఎంత గొప్ప అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ యాంజాల సుధాకర్రెడ్డి, సీఎం కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్రెడ్డి, తూప్రాన్ మండల పార్టీ అధ్యక్షుడు బాబుల్రెడ్డి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ ముదిరాజ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.