‘పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం కురవడం బాధాకరం.. ప్రభుత్వం అండగా ఉంటుంది.. రైతులెవ్వరూ అధైర్యపడవద్దు…’ అంటూ ప్రజాప్రతినిధులు అన్నదాతలకు ధైర్యం నూరిపోశారు. రైతులకు పంటనష్ట పరిహారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయ సిబ్బందితో క్షేత్రస్థాయి సర్వే చేయిస్తున్నారని, చివరి గింజ వరకూ ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా వరిధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఎఫ్సీఐ, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చకచకా కొనసాగుతున్నది. జిల్లాలో పలుచోట్ల పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ , ఏప్రిల్ 28
అందోల్, ఏప్రిల్29 : వరి సాగు చేసిన రైతులెవరూ అధైర్య పడొద్దని, వర్షానికి తడిసిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. జోగిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిముద్దతువుతున్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని రైతులకు భరోసా కల్పించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మల్లికార్జున్ గుప్తా, నాగభూషణం, నారాయణ, మాజీ ఎంపీపీ రామాగౌడ్ పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
కొల్చారం, ఏప్రిల్ 28 : రైతు బాధవుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్పల్లి చౌరస్తాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగ చేసింది సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు ఉదయ వేమారెడ్డి, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
రైతులను నష్టపోనియ్యం
వెల్దుర్తి, ఏప్రిల్ 28 : రైతులను నష్టపోనీయమని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. వెల్దుర్తితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి
రామాయంపేట, ఏప్రిల్28:సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అనన్నారు. శుక్రవారం రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, సీఈవో పుట్టి నర్సింలు, తహశీల్దార్ మన్నన్ ఉన్నారు.
ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
కౌడిపల్లి, ఎప్రిల్ 28: రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కౌడిపల్లి, మహమ్మద్ నగర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధ్దన్రెడ్డి, వైస్ చైర్మన్ చిన్న చిన్నంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, సర్పంచ్ దివ్య మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి ఉన్నారు.
అన్నదాతకు అండగా ఉంటాం
నిజాంపేట, ఏప్రిల్28 : బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చల్మెడలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. అక్కడి నుంచి చల్మెడలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యారు.