దుబ్బాక/ దుబ్బాక టౌన్, మార్చి 29 : దుబ్బాక ప్రాంతం మొదటి నుంచి బీఆర్ఎస్కు అండగా నిలిచిందని, ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన సమావేశానికి అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కార్యకర్తలు హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ… హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీని, తెలంగాణకు ఏమిచేయని బీజేపీని ఎంపీ ఎన్నికల్లో బొంద పెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీకి కొన్ని ఒడిదొడుకులు సహజమని, వాటన్నింటినీ అధిగమించి నిలబడతామని భరోసా ఇచ్చారు. కొంతమంది పోలీసులు, కొంతమంది అధికారులు ఎక్కువ చేస్తున్నారని, అన్నీ గమనిస్తున్నామన్నారు. నాడు తమ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లోనే నిమగ్నమైందే తప్పా ఎలాంటి చిల్లర విషయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు.
బీజేపీ పాలనలో రూపాయి విలువ పడిపోవడం, పేదరికం పెరిగిపోవడం, రైతులను రోడ్లమీదికి రప్పించడం జరిగినవి తప్పా చేసిన గొప్ప పనులు ఏమీ లేవని హరీశ్రావు అన్నారు. తెలంగాణకు బీజేపీ సర్కారు పైసా పనిచేయలేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఎడ్లు, బండి ఇవ్వని మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు పార్లమెంట్కు పోయి ఏమి ఉద్దరిస్తాడని ఎద్దేవా చేశారు. దుబ్బాక ప్రజలు ఓడించినా ఆయనకు బుద్ధిరాలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఎన్నికల ప్రచారాల హామీలను ఒక్కొక్కటిగా మాజీ మంత్రి హరీశ్రావు ఎల్ఈడీ స్క్రీన్లో పార్టీ శ్రేణులకు చూపిస్తూ వారి మోసపూరిత మాటలను ఎండగట్టారు.
పార్టీ శ్రేణులు సైతం ఇదే తరహాలో ప్రజలకు వివరించాలని కోరారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీది అసత్య ప్రచారమే. అబద్ధ్దాలతో అధికారం అందుకున్న కాంగ్రెస్ వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిందన్నారు. ‘పంటలు ఎండిపోతున్నాయి…కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…కరెంట్ సమస్యలు పెరుగుతున్నాయి. వీటికి సమాధానాలు ఏమిటి. బీఆర్ఎస్ శ్రేణులే నడుం బిగించాలి. ప్రశ్నించే గొంతుకలు కావాలి. బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ బోగస్ ప్రచారానికి పడాలి’..అని పార్టీ శ్రేణులకు హరీశ్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కార్యకర్తలు, ప్రజలు, నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీ ఆడే నాటకాల్లో భాగస్వాములు కావద్దన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీచైర్పర్సన్ రోజాశర్మ , బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీశ్రెడ్డి, ఎంపీపీ పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనిత, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్గౌడ్, రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, రజినీకాంత్రెడ్డి, మనోహర్రావు, రణం శ్రీనివాస్గౌడ్, రాంరెడ్డి, రవి, బానాల శ్రీనివాస్, వంశీకృష్ణ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపులో దుబ్బాక ప్రాంతం ప్రధాన పాత్ర పోషించాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. 2001 నుంచి 24 ఏండ్ల ప్రస్థానంలో ప్రతి ఎన్నికల్లోనూ దుబ్బాక గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరిందన్నారు. ఒక్కసారి మాత్రం వెయ్యి ఓట్లతో దెబ్బతిని తిరిగి మేల్కొని 54 వేల ఓట్లతో దెబ్బ కొట్టితే బీజేపీ బొక్కబోర్లా పడిందన్నారు. దుబ్బాక ప్రతి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిందని కరుడుగట్టిన ఉద్యమకారులు కేసీఆర్ వెంట నడిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. అదే స్పూర్తితో నేడు విద్యావంతుడైన వెంకట్రామిరెడ్డిని పార్లమెంట్కు పంపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని కోరారు. పేదలకు సేవచేసేందుకు ముందుకు వచ్చిన వెంకట్రామిరెడ్డికి రూ.వంద కోట్లతో విద్యానిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని హరీశ్రావు పేర్కొన్నారు.