నర్సాపూర్, ఏప్రిల్ 8: ప్రజలకు హామీలిచ్చి మాట తప్పిన పార్టీలు కావాలా, ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ కావాలా తేల్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్లో కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి హరీశ్రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దేశపతి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో బస్డిపో, చెక్డ్యామ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా నర్సాపూర్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామన్నారు.
కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. బాండు పేపర్లు సైతం రాసిచ్చి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకులు మాట తప్పారని వెల్లడించారు. ఆరు గ్యారెంటీల పేరుతో జనాలను మోసం చేసి ఓట్లు దండుకున్నారన్నారు. సీఎం రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా… జై తెలంగాణ అన్నవారిపై తుపాకీ పట్టుకొని బయలుదేరిన చరిత్ర ఆయనదన్నారు.
అమరవీరుల స్థూపం వద్ద ఒక్కనాడైనా రేవంత్ రెండుపూలు వేశాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఓట్లకు ఇంటికొస్తే ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సూచించారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతును గెలిపించాలని, మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పేదలను ఆదుకొని వారి మన్ననలు పొందాడని గుర్తుచేశారు. బీజేపీ అభ్యరిక్థి ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్లో బీఆర్ఎస్ తరఫున తాను గెలిచినట్లే ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలువడం తథ్యమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై బీఆర్ఎస్ సత్తా చాటారని, వ్యక్తులు కాదు, పార్టే ప్రధానమని బీఆర్ఎస్ కార్యకర్తలు నమ్మారని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేదలకు ఎంతో సేవ చేశారని గుర్తుచేశారు. ఆయనకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీని అందిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే పీవీఆర్ ట్రస్ట్ ద్వారా రూ.1కే పెండ్లీలు చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ ఇప్పిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు.
35 రోజులపాటు తనకోసం పనిచేయాలని కార్యకర్తలను కోరారు. పీవీఆర్ ట్రస్ట్ ద్వారా రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, జడ్పీటీసీ మహేశ్గుప్తా, నాయకులు సత్యంగౌడ్, సంతోష్రెడ్డి, శశిధర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.