పాపన్నపేట, మార్చి 8: తెలంగాణలోనే జానపదుల జాతరగా పేరుగాంచిన ఏడుపాయల వనదుర్గా భవానీమాత జాతర శుక్రవారం ప్రారంభమైంది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ,మహారాష్ట్ర,కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి సుమారు 12 లక్షల మంది వరకు భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా చేశారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు విడుదల చేయడంతో వసతులు కల్పించారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్,కలెక్టర్ రాహుల్రాజ్ దంపతు అమ్మవారిని దర్శించుకున్నారు.వీరికి ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్రెడ్డి స్వాగతం పలికారు.
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా భవానీమాతను ప్రత్యేకంగా అలంకరించారు. ఎప్పుడూ వెండి కిరీటంతో దర్శనమిచ్చే అమ్మవారిని, జాతర సందర్భంగా బంగారు కిరీటం, బంగారు నగలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ గర్భగుడితో పాటు ఆలయం లోపల బయట వివిధ రకాల రంగుల పూలతో అలంకరించి విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు.
ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం ఎదుట మంజీరా పాయల్లో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. కోయంబత్తూరులోని ఈషా పౌండేషన్ మాదిరిగా ఏర్పాటు చేశారు. భక్తులు వేకువజామునే మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివుడి విగ్రహానికి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు చేపట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు ఏడుపాయలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీదర్, జహీరాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు నాగ్సాన్పల్లి మీదుగా ఏడుపాయల చేరుకున్నారు. హైదరాబాద్ బాలానగర్, నర్సాపూర్, సంగారెడ్డి తదితర ప్రాంతాల భక్తులు పోతన్శెట్టిపల్లి మీదుగా ఏడుపాయలకు చేరుకున్నారు.
మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి పర్యవేక్షణలో మెదక్ డీఎస్పీ రాజేశ్ ఆధ్వర్యంలో ఏడుపాయల్లో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు మఫ్టీలో పోలీసులను నియమించి బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఏడుపాయల అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. దుర్గామాత దర్శనం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏడుపాయల్లో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు.