బూర్గంపహాడ్, జూన్ 4 : పోలవరం బ్యాక్వాటర్ బాధితులకు న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు వేర్వేరుగా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) బృందాన్ని సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో కలిసి చర్చించారు.
పీపీఏ సీఈవో సంజీవ్ నందన్ సహాయ్ను కలిసి పోలవరం బ్యాక్వాటర్ వల్ల పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం, బూర్గంపహాడ్ ప్రాంతాల్లో ముంపు పరిస్థితులను వివరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ముంపు ప్రాంతాల బాధితులకు మెరుగైన పరిహారం, ప్యాకేజీ ఇవ్వడంతోపాటు శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని, భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరారు.
బూర్గంపహాడ్ సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం సభ్యులకు సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో గురువారం వినతిపత్రం అందజేశారు. పోలవరం బ్యాక్వాటర్తో పొంచి ఉన్న ముప్పుపై అధికారులకు వివరించారు. వినతిపత్రం అందించిన వారిలో వార్డు సభ్యులు భజన పెదనాగం, తోకల శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు లక్కోజి విష్ణువర్ధన్, కేవీ రమణ, కైపు శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, వీవీబీ చారి, ఆశిక్, దన్సీరామ్, పున్నంచంద్, హరినాథ్, వెంకన్న, వెంకటేశ్వర్లు, మున్నా ఉన్నారు.