మెదక్ మున్సిపాలిటీ, జూన్ 12: తెలంగాణలో పండుగలా దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు సోమవారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ను ఎమ్మెల్యే, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ రన్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుంచి ప్రారంభమై ఇందిరాగాంధీ స్టేడియం వరకు విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో సాధించి తెలంగాణలో అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. తొమ్మిదేళ్లలో అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించుకున్నామన్నారు. యువత శారీరక దృఢత్వంపై దృష్టి సారించి, ఫిట్గా ఉండాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇటీవలే సీఎం కప్ను సైతం నిర్వహించుకున్నామన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని యువతకు క్రీడలు, వ్యాయామంపై ఆసక్తి పెంపొందిస్తున్నామన్నారు. తెలంగాణ రన్ను విజయంతం చేసిన జిల్లా యంత్రాంగానికి ఉపాధ్యాయులు, పీఈటీలు వివిధ శాఖల అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత శాంతి భద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం కల్పించిందన్నారు. నేడు దేశంలోనే మన పోలీస్ వ్యవస్థ అగ్రగామిగా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ టర్న్స్ అనే ఇంగ్లిష్ అక్షరాలతో విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. ఎమ్మెల్యే, కలెక్టర్ అందరితో కలిసి స్టెప్పులేశారు. అనంతరం గాలిలోకి బెలూన్లు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సైదులు, ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జిల్లా క్రీడాలధికారి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, పోలీసులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
శారీర దృఢత్వంతోనే మానసిక
ప్రశాంతత: కలెక్టర్ రాజర్షిషా
శారీరకంగా దృఢత్వం సాధించగలిగితేనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ రోజు వరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో దశాబ్ది ఉత్సవాలు విజవంతమయ్యాయన్నారు. ఈనెల 22 వరకు నిర్వహించే మిగతా కార్యక్రమాల్లో ఇదే స్ఫూర్తితో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.