మెదక్ : రైతుల సంక్షేమం, రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేందుకు ముందుకు రాకపోయినా రైతుల సంక్షేమాన్ని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. అందులో భాగంగా గురువారం హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తొండి చేస్తున్నదని, హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో పంటలు కొంటూ ఇక్కడ కొనేందుకు ససేమిరా అంటున్నదని విమర్శించారు. యాసంగి పంట రా రైస్ (ముడి బియ్యం) నూకలు వస్తాయని కొననంటున్నదని, కొంత నష్టమైనా రైతులను కాపాడుకోవాల్సిన భాద్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నది. రైతులు తక్కువ ధరకు పంటను బయట విక్రయించుకోవద్దని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్ ,జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయధికారి పరశురామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.