బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా జరుగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సమ్మేళనాలకు తరలివస్తున్నారు. జిల్లా ఇన్చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేలు వారికి దిశానిర్దేశం చేస్తూ ఉత్తేజ పరుస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఇన్చార్జి యెగ్గె మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బు ఏండ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేశారని, అన్నిరంగాల్లో తెలంగాణను దేశానికి రోల్మోడల్గా నిలిపారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేటకు త్వరలోనే కాళేశ్వరం జలాలు వస్తాయని తెలిపారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అంతకుముందు పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్దలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పాల్గొని మాట్లాడారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధిని ఇంటింటికీ వివరించి ఆ పార్టీల నాయకులు తలదించుకునేలా చేయాలని పిలుపునిచ్చారు.
నారాయణఖేడ్/నాగల్గిద్ద/చిన్నశంకరంపేట, ఏప్రిల్ 2 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చిన్నశంకరంపేటలోని శ్రీనివాస గార్డెన్లో మండల క్లస్టర్ ఒకటి 14 గ్రామాల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మహిళలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశానికి బొట్టు పెట్టి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వారు నివాళులర్పించారు. అనంతరం వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో, డీజే పాటలతో పటాకుల మోతలతో పట్టణం దద్ధరిల్లింది. ఎమ్మెల్యే డప్పుకొట్టి కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కావడంలేదన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ ఏర్పాటు చేసుకున్న అతితక్కువ సమయంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలు అభివృద్ధి పర్చారన్నారు. త్వరలోనే చిన్నశంకరంపేట మండలానికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారని, మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్య గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరించాలని కార్యకర్తలు సూచించారు. కార్యకర్తలే బీఆర్ఎస్ బలగమన్నారు.
బీజేపీ ధరలు పెంచితే బీఆర్ఎస్ పథకాలను అందిస్తుంది..
– మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచితే బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను అందిస్తుందని జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తెలిపారు. బీఆర్ఎస్కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఒర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆ పార్టీలు ప్రజలకు ఏమి ఒరగబెట్టారని, ఏం ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. గతంలో కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం రోడ్లెకేవారని, ప్రస్తుతం తెలంగాణలో రైతులకు ఆ పరిస్థితి లేదన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గొల్ల, కురుమలకు రాయితీపై గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నారని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దకిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.
కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీటీసీ పట్లూరి మాధవి, రైతుబంధు మండలాధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, నార్సింగ్ మండల వైస్ ఎంపీపీ సుజాత శంకర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, ఎంపీటీసీలు రాధిక యాదగిరి, సర్పంచులు బందెల జ్యోతి, పడాల రమాదేవి, నర్సమ్మ, లక్ష్మణ్, పోచయ్య, సిద్ధిరాంరెడ్డి, దయానంద్ యాదవ్, రమేశ్, సింగిల్ విండో చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కుమార్గౌడ్, సత్యనారాయణరెడ్డి, బాగారెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, హేమశ్రీను, దుర్గపతి, స్వామి, నాగరాజ్, మహిపాల్రెడ్డి, రాములు, లక్ష్మణ్, రవీందర్రెడ్డి, మల్లేశం, బాలకిషన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.