పాపన్నపేట, మార్చి 7: తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 8 శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పెద్దఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తదితర రాష్ర్టాల నుంచి సుమారు 10 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉత్సవాలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 8న మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు ఉపవాస దీక్షలు చేపడతారు. జాతర రెండో రోజు 9న బండ్లు తిరిగే కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తారు. జాతరలో 100 పైగా బండ్లు తిరుగుతాయి. జాతర చివరి రోజైనా 10న రాత్రి రథోత్సవం వైభవంగా చేపడుతారు. బీదర్, నారాయణఖేడ్, జహీరాబాద్, బొడ్మట్పల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఏడుపాయల కమాన్ మీదుగా జాతరకు వెళ్లాల్సి ఉంటుం ది. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాలపై ఈ రహదారి నుంచి వెళ్లవచ్చు. ఏడుపాయల్లోని చెల్మెలకుంట వద్ద గల చెక్పోస్ట్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అక్కడే వాహనాలను ఆపి కిలోమీటర్ మేర నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్, బాలానగర్, నర్సాపూర్, సంగారెడ్డి, జోగిపేట ప్రాంతాల నుంచి వచ్చేవారు నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు గుండా ఏడుపాయల్లోని రెండో బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో తమ వాహనాలను ఆపి జాతరలోకి వెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలు వెళ్లడానికి ఏడుపాయల దేవస్థానం 8 మినీ బస్సులు రెండు ప్రాంతాల పార్కింగ్ స్థలాల నుంచి ఏర్పాటు చేసింది.
జాతర కోసం మెదక్ ఆర్టీసీ రీజియన్ నుంచి 167 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వీఐపీ క్యూలైన్లు, బారికేడ్లు, జనరల్ క్యూలైన్లు, షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు, తాగునీటి కుళాయిలు, సీసీ కెమెరాల ఏర్పాటు, పెద్దఎత్తున పారిశుధ్య కార్మికులు, గజ ఈతగాళ్లు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు సుమారు 12 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. పలుమార్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు జరిగాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తుల రద్దీకనుగుణంగా సాధారణ, వీఐపీ క్యూలైన్లు ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ బాలాగౌడ్ తెలిపారు. ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతరను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఏడుపాయలకు చేరుకొని అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. దీంతో ఏడుపాయల వనదుర్గా మాత జాతర ప్రారంభం కానుంది. జాతర కోసం ప్రభుత్వం రూ. 2 కోట్లను విడుదల చేసింది.