పటాన్చెరు టౌన్, జూన్ 11: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్లో త్వరలో మేకల మండి, చేపల మార్కెట్ను అందుబాటులోకి తీసుకొస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు ప్రాంత అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపే లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గురువారం పటాన్చెరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. మార్కెట్ యార్డు పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్ల క్రితం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటయ్యిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు మార్కెట్ అభివృద్ధికి దశల వారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. రూ.20.46 కోట్ల అంచనా వ్య యంతో 172 దుకాణాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. గడువులోగా వీటిని పూర్తి చేసి లైసెన్స్ వ్యాపారులకు అందజేస్తామన్నారు. మేకల మండితో పాటు ఆధునిక స్లాటర్ హౌస్, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు మార్కెట్ ఆదాయాన్ని వినియోగిస్తూ దీర్ఘకాలిక ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు.
మార్కెట్ను తెలంగాణలోనే ఆదర్శంగా అభివృద్ధి చేస్తామన్నారు. మేకల మండి ఏర్పాటు కోసం మార్కెట్ సమీపంలోని రైల్వేశాఖకు చెందిన 38 ఎకరాలను మార్కెట్ శాఖకు బదలాయించాలని గతంలో అప్పటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ద్వారా కేంద్రానికి విన్నవించినట్లు చెప్పారు. త్వరలోనే కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిసి భూమి కేటాయింపు అంశంపై చర్చిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, మార్కెటింగ్ విభాగం డీఈ రవీందర్, మార్కెట్ కార్యదర్శి సునీల్, బీఆర్ఎస్ నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.