జిన్నారం, మార్చి 21 : ‘ఇన్నాళ్లూ పార్టీకి ఎన్ని ఇబ్బందులు తెచ్చినా ఊరుకున్నాను. ఇక ఉపేక్షించేది లేదు. ఇకపై అలాంటి వారిపై కఠిన నిర్ణయాలు, చర్యలు ఉంటాయి. ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది’ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమంతో నియోజకవర్గంలో పనులు చేసుకుంటు ముందుకు వెళ్తుంటే కొందరు కులాలు, వర్గాలు అంటూ రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్కు నష్టం చేస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిన్నారం మండలం ఊట్ల గ్రామ శివారులోని ఎన్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై మండల ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతలోతుగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. గడ్డపోతారం పులిగిల్ల ఫంక్షన్ హాల్లో ఈనెల 27న నిర్వహించే ఆత్మీ సమ్మేళనంలో పాల్గొనే మూడు వేల మందిలో సంగం మంది మహిళలు ఉండాలన్నారు. మానవతా దృక్పథంతో ప్రజలకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. భ్రమలో పడి పక్కదారి పట్టిన నాయకులు, కార్యకర్తలను మళ్లీ పార్టీలోకి పిలవాలని సూచించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ పటాన్చెరులో దవాఖాన ప్రారంభోత్సవానికి, శివనగర్లో ఎల్ఈడీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరువుతున్నారని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్లు భ్రమలో ఉన్నాయని, ఈ సారి వంద సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. మూడోసారి కూడా కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ ఇతర సంక్షేమ పథకాలను బుక్లెట్ రూపంలో తయారు చేసి ఇంటింటికి పంచిపెట్టాలని సూచించారు. ముఖ్య కార్యకర్తల సమావేశానికి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి ఎంత మంది హాజరవుతారు, ఎన్ని బైక్లతో ర్యాలీ అనే వివరాలను గ్రామాల వారీగా పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, గడ్డపోతారం సర్పంచ్ ప్రకాశ్చారి మాట్లాడారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, నాయకులు, ఉప సర్పంచ్లు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.