నారాయణఖేడ్, మే 6 : ప్రజలకు రవాణా సేవలందించే ఆర్టీసీకి రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం నారాయణఖేడ్ నుంచి మనూరు మండలం బోరంచ మీదుగా సికింద్రాబాద్కు బస్సు సేవలను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్టీసీ సంస్థను లాభాల బాటలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అధికారులు నిబద్ధతతో పని చేస్తూ సంస్థ రాబడి పెంచేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వం మారుమూల గ్రామాలు, తండాలకు సైతం మెరుగైన బీటీ రోడ్డు వేసిందని, అందుకనుగుణంగా ప్రతి గ్రామానికీ ఆర్టీసీ సేవలను విస్తరించేందుకు దశల వారీగా చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బోరంచ నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లే భక్తులు ఈ బస్సును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం మల్లేశయ్య, ఆర్టీసీ ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్, మార్కెటింగ్ సెల్ ఇన్చార్జి పాండు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ముమ్మర ఏర్పాట్లు..
నారాయణఖేడ్, మే 6: ఆదివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మున్సిపల్ చైర్పర్సన్ రుబీనా బేగం నజీబ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. మంగల్పేట్ దుర్గాభవానీ మందిరం నుంచి సాయిబాబా ఫంక్షన్హాల్ వరకు భారీ బైక్ర్యాలీ చేపట్టనున్నారు. పట్టణంలోని రాజీవ్చౌక్, బసవేశ్వరచౌక్ వద్ద ఎమ్మెల్యేను భారీ గజమాలతో సత్కరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం సాయిబాబా ఫంక్షన్హల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కేక్ కట్ చేస్తారు. ఇదిలా ఉంటే తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.