కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలని, దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రేగోడ్ మండల కేంద్రంలో మంగళవారం నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అనేక పథకాలతో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలు పూర్తయితే లక్షలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారుతాయని తెలిపారు. కులమతాలపేరుతో ప్రజల మధ్య గొడవలకు ప్రయత్నిస్తున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
– రేగోడ్, మే16
రేగోడ్, మే 16: మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే గెలుపని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రేగోడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే మండల కేంద్రంలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యమాలలో లింగంపల్లి, రేగోడ్, ప్యారారం, ఆర్ ఇటిక్యాల గ్రామాలకు చెందిన ఉద్యమ నాయకులు మాణిక్యరావు, సంగారెడ్డి, జయరావు, శ్రీనివాస్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపి, వేదికపైకి ఆహ్వానించారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, ప్రతి కార్యకర్త కష్టపడితేనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు.
తెలంగాణ ప్రభుత్వ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కోట్ల రూపాయల అభివృద్ధి చేపట్టామన్నారు. అప్పటి ప్రభుత్వాల హయాంలో పాలకులను కలవాలంటే ఇంటి వద్ద పడిగాపులు కాసేవారని, ఇప్పుడు కూతవేటు దూరంలో స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్త సమస్యకు పరిష్కరిస్తున్నామన్నారు. మండుటెండలో సైతం ఇంత మంది రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుల, మతాలను రెచ్చగొడుతూ కొన్ని పార్టీలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
బసవేశ్వర-సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం పచ్చని పంటపొలాలతో కనబడుతుందన్నారు. రాబోయె ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టనున్నదన్నారు. మీరందరూ బీఆర్ఎస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సభలో కళాకారుల ధూంధాం ఆటపాటలు అలరించాయి. బీఆర్ఎస్ జోగిపేట సీనియర్ నాయకుడు జగన్మోహన్రెడ్డి, రాయికోడ్ మండల సీనియర్ నాయకుడు, మండల ఇన్చార్జి సిద్ధన్న పటేల్, ప్రధాన కార్యదర్శి సుంకె రమేశ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్, మండల మాజీ అధ్యక్షుడు వినోద్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, ఎంపీటీసీ నర్సింహులు, స్థానిక సర్పంచ్ నర్సింహులు, మాజీ కోఆప్షన్ మొహిజ్ పటేల్, మాజీ వైస్ ఎంపీపీ, సీనియర్ నాయకులు కిషన్రెడ్డి, సర్పంచ్లు పూలమ్మ, అనిత, మంజుల, సుమంత, సంగయ్య, విజయలక్ష్మి, కళావతి, నిర్మల, సుగుణ, పార్టీ కార్యకర్తలు తదితలు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ర్యాలీ..
రేగోడ్ మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్కు గజమాలతో ఘనంగా సన్మానించారు. డప్పుచప్పుళ్లతో బంజారా నృత్యాల మధ్య నిర్వహించిన ర్యాలీ ఎంతో ఆకట్టుకున్నది. ఈ ర్యాలీలో ఎడ్ల బండిపై ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ను ఊరేగించారు.