దుబ్బాక,మార్చి 14 : మల్లన్నసాగర్ ఉప కాల్వల నిర్మాణ పనులను వేగంగా చేపట్టి, రైతులకు సాగునీటి కష్టాలను తొలిగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అధికారులకు ఆదేశించారు. దుబ్బాక మండలంలో మల్లన్నసాగర్ 4ఎల్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. 4ఎల్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల ద్వారా దుబ్బాక మండలం, మున్సిపాలిటీలో 11 గ్రామాల రైతులకు సాగునీటి సరఫరా కానున్నది.
మల్లన్న సాగర్ ప్రధాన కాల్వ దుబ్బాక నియోజకవర్గం మీదుగా పక్కనున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు ప్రాజెక్టు వరకు అనుసంధానం చేశారు. ఈ ప్రధాన కాల్వ నుంచి 4ఎల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా దుబ్బాక మండలంలో 11 గ్రామాలకు ఉప కాల్వలను నిర్మిస్తున్నారు.ఉప కాల్వల నిర్మాణ పనులు పలుచోట్ల నిలిచిపోవడంతో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి స్పందించారు. నీటి పారుదలశాఖ అధికారులు, మెగా కాంట్రాక్టు సిబ్బందితో కలిసి ఉప కాల్వల నిర్మాణ పనులను పరిశీలించారు.
సమస్యాత్మక ప్రదేశాలను పరిశీలించడంతో పాటు స్థానిక రైతులతో ఎమ్మెల్యే చర్చించారు. కాల్వల నిర్మాణ పనులను అడ్డుకోవద్దని కోరారు. ఆనంతరం నీటి పారుదల శాఖ ఎస్ఈ బసవరాజు, ఈఈ వేణుబాబు, డీఈ శ్రీధర్, ఏఈ విష్ణువర్ధన్రెడ్డి, మెగా కాంట్రాక్టు సిబ్బందితో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్లన్న సాగర్ ఉప కాల్వల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, త్వరితగతిన పూర్తిచేసి సాగునీరు అందించాలన్నారు. రైతులకు పరిహారం వెంటనే అందించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
మల్లన్నసాగర్ ప్రధాన కాల్వ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని 4ఎల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 15 కి.మీ పొడవు ఉప కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ ఉప కాల్వల ద్వారా 11 గ్రామాల్లో 30వేల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. పలుచోట్ల పెండింగ్లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు యాదగిరి, శ్రీనివాస్, స్వామి బీఆర్ఎస్ నాయకులు కొత్త కిషన్రెడ్డి, గన్నే భూంరెడ్డి, మూర్తి శ్రీనివాస్రెడ్డి, వంశీగౌడ్, రాంరెడ్డి పాల్గొన్నారు.