జహీరాబాద్, నవంబర్ 10: దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కాకముందు నిజాం పాలనలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో జహీరాబాద్ ఉండేది. భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడి జహీరాబాద్ ఆంధ్రప్రదేశ్లో విలీనమై తాలూకా కేంద్రంగా, శాసనసభ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. నియోజకవర్గం కేంద్రంగా మారి రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాల్లో సంభవించిన పరిణామాల కారణంగా జహీరాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది. 1957 సంవత్సరం నుంచి ఒకే పార్టీ తరఫున వరుసగా ఏడుసార్లు పోటీ చేసి గెలిచిన ఎం.బాగారెడ్డి తదనంతరం మూడుసార్లు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మహేంద్ర అండ్ మహేంద్ర ట్రాక్టర్ ప్లాంట్తో పాటు బూచినెల్లి గ్రామ శివారులో ఇండస్ట్రియల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నది. జహీరాబాద్ ప్రాంతంలో ఇప్పడు అనేక బహుళ జాతీ సంస్థల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాల్లో సాగు భూములు ఉన్న 20శాతం భూములు సేద్యం నీరుతో సాగు చేస్తున్నారు. చెరువులు లేకపోయిన రైతులు బావుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు.
జహీరాబాద్ భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడిన 1957 సంవత్సరంలో శాసనసభ నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్లో విలీనమయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కాకముందు కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో ఉండేది. 1957లో జహీరాబాద్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జహీరాబాద్, కోహీర్, ఝరాంగం, రాయికోడ్, న్యాల్కల్ మండలాలు నియోజకవర్గంలో ఉండేవి. 1978 ఎన్నికల్లో న్యాల్కల్ మండలాన్ని నారాయణఖేడ్ నియోజకవర్గంలో విలీనం చేశారు. 2009లో జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాలతో జహీరాబాద్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. రాయికోడ్ మండలాన్ని అందోల్ నియోజరవర్గంలో విలీనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ మండలంలో ఉన్న కొన్ని గ్రామాలను తీసుకొని కొత్తగా మొగుడంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది. జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి తూర్పున అందోల్ నియోజకవర్గం, వాయువ్య దిశన నారాయణఖేడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ పడమర దిశలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులు విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్, ముంబాయి జాతీయ రహదారి ఉన్నందున వ్యాపారం, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో అనతికాలంలోనే అభివృద్ధి చెందింది.
జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం 2009 లో ఎస్సీ రిజర్వేషన్గా మారింది. ఎస్సీ రిజర్వేషన్గా మారిపోయిన జహీరాబాద్ శాసనసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ స్థానికేతరులకు టికెట్లు ఇస్తుంది. 2009 ఎన్నికల్లో గజ్వేల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న గీతారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. జహీరాబాద్ ఎస్సీ రిజర్వేషన్గా మరిపోవడంతో స్థానిక కాంగ్రెస్ ఎస్సీనేతలు, ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం స్థానికేత గీతారెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గీతారెడ్డి పోటీచేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గీతారెడ్డి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు చేతిలో ఓటమి చెందారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎస్సీ నేతలకు పార్టీ టికెట్ ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానిక నేతలకు ఇవ్వకపోవడంతో ఎస్సీనేతలు స్థానికేతరును ఓడించేందుకు ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఝరాసంగం జడ్పీటీసీ వినీలానరేశ్ పార్టీకి రాజీనామా చేసి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎస్సీనేతలకు టికెట్ ఇవ్వకపోవడంతో తమకు రాజ్యాంగ రిజర్వేషన్ కలిపించినా కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదని ఎస్సీనేతలు ఆరోపణలు చేస్తున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ స్థానం నుంచి విశ్రాంతి ఆర్టీవో, ఝరాసంగం నివాసి కొనింటి మాణిక్రావుకు టికెట్ ఇచ్చారు. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2018 ఎన్నికల్లో కొనింటి మాణిక్రావు 34,473 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్కు చెందిన చంద్రశేఖర్కు టికెట్ ఇవ్వడంతో కొనింటి మాణిక్రావు విజయం ఖాయమని తేలిపోయింది. జహీరాబాద్లో కొనింటి మాణిక్రావు రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తారని పలువురు రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. నిరుపేదలు, పేదలతో పాటు అన్నివర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉండడంతో విజయం ఖాయమని తెలిసిపోయింది. జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 12సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకసారి టీడీపీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2018లో బీఆర్ఎస్ విజయం సాధించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి, కొత్తగా మొగుడంపల్లిని మండలంగా ఏర్పాటు చేసింది. గిరిజన తండాలు, చిన్న గ్రామాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. రెవెన్యూ డివిజన్ చేయడంతో జహీరాబాద్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నది. ఝరాసంగం, న్యాల్కల్ మం డలంలో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి ఏర్పాటు చేస్తున్నది. దీంతో వేలాదిమందికి ఉపాధి లభించేందుకు అవకాశం వచ్చింది. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నది.