తన తుదిశ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 153 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. 120 మందికి 59 జీవో పట్టాలు పంపిణీ చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సిద్దిపేట వేంకటేశ్వరస్వామి దేవాలయం, పారుపల్లి వీధిలోని పాత వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. గాడ్ విజన్ అసోసియేషన్, పాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో, రిశీ ప్రభాకర్ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో సిద్దిపేట వైశ్య సదనంలో నిర్వహించిన విశ్వ హృదయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు
11 వేల మందికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.93 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చి, పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆసరాగా నిలిచామన్నారు. సిద్దిపేటలో
కార్పొరేట్ స్థాయిలో దవాఖాన ఏర్పాటు చేశామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా కేసులు నమోదవుతుండడంతో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అందరికీ అన్నివేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
సిద్దిపేట, డిసెంబర్ 23: తన తుది శ్వాస వరకు సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 153 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. 120 మందికి 59 జీవో పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11 వేల మందికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.93 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చి, పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆసరాగా నిలిచామన్నారు. సిద్దిపేటలో కార్పొరేట్ స్థాయిలో దవాఖాన ఏర్పాటు చేశామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నట్లు తెలిపారు.
వైకుంఠనాథుడి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మొక్కుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం సిద్దిపేట వేంకటేశ్వర స్వామి దేవాలయం, పారుపల్లి వీధిలోని పాత వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. దేశం, రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా చూడాలని ప్రార్థించారు.
సిద్దిపేటలోని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు ద్వారాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సిద్దిపేట సర్వ మతాలకు నెలవని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో గాడ్ విజన్ అసోసియేషన్, పాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నామినేషన్ వేసే సమయంలో వేంకటేశ్వర స్వామి గుడితో పాటు మన సిద్దిపేట చర్చ్లో ప్రార్థనలు చేస్తానని గుర్తుచేశారు. సిద్దిపేట అంటేనే సర్వ మతాలను గౌరవించే సంసృతి సంప్రదాయాలు మనవన్నారు. దసరా, బతుకమ్మ పండుగలకు ఏ విధంగా కానుక ఇస్తామో క్రిస్మస్లో క్రిస్టియన్లకు గౌరవించుకుంటానన్నారు. సమాజ శ్రేయస్సుకు పాటు పడుతున్న అసోసియేషన్ పెద్దలకు అభినందనలు తెలిపారు. సమాజ సేవలో వారితో పాటుగా భాగస్వామినవుతానని, తన నెల వేతనం మీ అసొసియేషన్కు ఉడుతా భక్తి సహాయంగా అందిస్తానన్నారు. అసొసియేషన్తో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకొన్నారు.
యోగా, ధ్యానంతోనే ఆరోగ్యం, ఆనందం కలుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రిశీ ప్రభాకర్ విద్యాకేంద్రం ఆధ్వర్యంలో సిద్దిపేట వైశ్య సదనంలో నిర్వహించిన విశ్వ హృదయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడారు. సిద్దిపేటలోని రిశీ ప్రభాకర్ విద్యాకేంద్రం ఆధ్వర్యంలో విశ్వ హృదయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులా రాజనర్సు, నాయకులు వేణుగోపాల్రెడ్డి, గుండు రవితేజ, ఆలయ కమిటీ సభ్యులు, ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు సికిందర్, రవీందర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట కమాన్, డిసెంబర్ 23: సిద్దిపేట పట్టణ శివారులోని లింగారెడ్డిపల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సరస్వతి శిశు మందిర్ విద్యాలయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భూమిపూజ చేశారు. లింగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ రామస్వామి కుమారుడి వివాహం జరిగింది. శనివారం వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరూలను ఆశీర్వదించారు. బూరుగుపల్లి సర్పం చ్ కమలాకర్రావుకు గుండెకు సంబంధిత చికిత్స జరిగి, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.