పటాన్చెరు, మార్చి 15: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పటాన్చెరు పట్టణంలోని శాంతినగర్లోని మధుసూదన్రెడ్డి నివాసాన్ని పోలీసు బలగాలు దిగ్బంధించి ఆయన్ను అరెస్టు చేశారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసుల మధ్య ఆయనను పటాన్చెరు పోలీస్స్టేషన్కు తరలించారు. లక్డారంలో ఎమ్మెల్యే కుటుం బ సభ్యుల నిర్వహణలోని క్రషర్లలో కేటాయింపులు జరిగిన దానికంటే అధికంగా క్రషింగ్ జరిగిందని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.
గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు సంగారెడ్డి కోర్టుకు తరలించేందుకు తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు గూడెం మధుసూదన్రెడ్డిని సంగారెడ్డికి తరలించారు. సంగారెడ్డిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. గూ డెం మధుసూదన్రెడ్డి అరెస్ట్పై పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.