సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 8: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై నియోజకవర్గంలోని నాలుగు మండలాలు,రెండు మున్సిపాలిటీల సమన్వయకర్తల సమావేశం సోమవారం సంగారెడ్డిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగౌడ్తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను గడగడపకూ తీసుకువెళ్తూ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగౌడ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలాన్ని చాటాలని సూచించారు. పట్టణ సమన్వయకర్తలు హకీం, వెంకటేశ్వర్లు, విజయేందర్రెడ్డి, డాక్టర్ శ్రీహరి, సమన్వయకర్తలు పాల్గొన్నారు.