సంగారెడ్డి జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు ప్రొటోకాల్ విషయంలో సమస్యలు తలెత్తుతుండడం దురదృష్టకరమన్నారు. శాసనసభ, అధికారిక నిబంధనలను అనుసరించి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు అధికారులు కచ్చితంగా ప్రొటోకాల్ అమలు చేయాల్సి ఉందని తెలిపారు. నియోజకవర్గంలో అధికార యం త్రాంగం ప్రొటోకాల్ అమలుచేయడంలో విఫలమవుతున్నట్లు చెప్పారు. బుధవారం సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ అమలు చేయకుండా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తాను హాజరైనా అక్కడి అధికారులు ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమం నిర్వహించలేదన్నా రు.
ఎమ్మెల్యే హోదాలో తాను కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, అధికారులు చెక్కులు పంపిణీ చేయనివ్వలేదని ఫిర్యాదు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వచ్చే వరకు వేచిఉండేలా చేశారని, గంటన్నర వేచి చూసినా నిర్మలారెడ్డి రాలేదన్నారు. దీంతో తాను, లబ్ధిదారులు ఇబ్బందులకు గురైనట్లు చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం చెక్కులు పంపిణీ చేస్తానని చెప్పినా అధికారులు స్పందించలేదన్నారు. దీంతో కార్యక్రమం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు. తాను వెళ్లాక కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయించినట్లు చెప్పారు. సదాశివపేటలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సైతం అధికారులు ప్రొటోకాల్ పాటించలేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని స్పీకర్కు తెలిపారు. అధికార యంత్రాంగం కచ్చితంగా ప్రొటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిలకు లేఖ రాశారు.