నారాయణఖేడ్/ నాగల్గిద్ద, మార్చి 2: కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు వివరించి కాంగ్రెస్, బీజేపీ నాయకులు తలదించుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ మండలం జుజాల్పూర్ శివారులోని హెచ్ఆర్ ప్యాలెస్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నాగల్గిద్ద మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారికి బుద్ధి చెప్పాలని సూచించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. గ్రామాలు, తండాలకు రోడ్లు మంజూరు చేస్తే కేసులు వేయడం, బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేయగా, ఆయా పనులు జరగకుండా కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారన్నారు.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న క్రుటలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగల్గిద్ద మండలం ఎంతో అభివృద్ధి చెందిందని, ఎండా కాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు కిలోమీటర్లు నడిచి నీరు తెచ్చుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా మారుమూల తండాల్లోనూ ఇంటింటికీ నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తు చేశారు. డబుల్లేన్ రోడ్లు, తండాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. ప్రభుత్వం ఎనిమిది చెరువులను మంజూరు చేయగా, ఆరు చెరువులను నాగల్గిద్ద మండలంలోనే నిర్మిస్తున్నట్లు చెప్పారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నాగల్గిద్ద మండలంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు. నారాయణఖేడ్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేసి చరిత్ర తిరగరాయాలని, ఇందుకు కార్యకర్తలు కార్యోన్ముఖులై పని చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పండరి, ఎంపీపీ మోతీబాయి, జడ్పీటీసీ రాజు రాథోడ్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు పండరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
కంగ్టి మండలం జీర్గితండాకు చెందిన ఉపసర్పంచ్ లచ్చిరాం సహా పలువురు ఆదివారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మెట్టుతండాకు బీటీరోడ్డు కోసం రూ.60 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో కంగ్టి మండల నాయకులు వెంకట్రెడ్డి, మనోజ్ పటేల్ ఉన్నారు.