సిద్దిపేట, మే16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “తక్కెడు బంగారం ఇచ్చిన తడ్కపల్లికి పిల్లనివ్వను.. అనే సంప్రదాయం అప్పట్లో ఉండే”.. సిద్దిపేట నియోజకవర్గంలో పిల్లనివ్వాలంటే ఈ సామెత విరివిగా ప్రాచుర్యంలో ఉండే. ఇదే సామెతను నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు గ్రామాల్లో నాడు సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించే వారని కేసీఆర్ సన్నిహితులు, పెద్ద మనుషులు గుర్తు చేస్తుంటారు. అప్పట్లో తాగునీటి కోసం పల్లె జనం పడరాని పాట్లు పడేవారు. ఓ వైపు ఫ్లోరైడ్ బాధ.. మరో వైపు గుక్కెడు నీటికి కటకట.. ఈ సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచనకు ప్రతి రూపమే మానేరు తాగు నీటి పథకం. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ నుంచి ఫ్లోరైడ్ పీడిత సిద్దిపేట నియోజకవర్గానికి ఇంటింటా తాగునీరు అందించారు. (1998 చేపట్టిన పనులు 2000లో పూర్తిచేసి అందించారు). సిద్దిపేట తాగు నీటి పథకం స్ఫూర్తితో ఇవ్వాళ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్నారు. జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతున్నది.
స్వరాష్ట్రంలో మహిళల కష్టాలు తీరాయి
నాడు సమెక్య రాష్ట్రంలో చెంబెడు నీటి కోసం ఎన్నో కష్టాలు.. బిందెలు పట్టుకొని ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడికి వెళ్లి తెచ్చుకున్న సందర్భాలు.. ఎండకాలం వచ్చిందంటే వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు.. కిలో మీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకున్న మహిళల కష్టాలు స్వరాష్ట్రంలో తీరాయి. నాటి సమైక్య రాష్ట్రంలో మహిళల కష్టాలను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలే. ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని నీటి కోసం బయటకు వెళ్లకూడదని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా గోదావరి జలాలు అందించి మహిళల కష్టాలు తీర్చారు. సిద్దిపేట మానేరు పథకం స్ఫూర్తితో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ అమలవుతున్నది. సిద్దిపేట జిల్లాలో సుమారు రూ.1200 కోట్లు ఖర్చుచేసి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేశారు.
జిల్లాలో 752 హ్యాబిటేషన్స్లో 2,640 కి.మీ ప్రధాన పైపులైన్ వేసి 2,03,370 నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటిని అందిస్తున్నారు. ఇవాళ ఏ ఇంటికి వెళ్లినా నల్లా తిప్పగానే గోదావరి జలాలు బిందెలో పడుతున్నాయి. ఆ నీళ్లల్లో సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారని ఆయా గ్రామాల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట,గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహడ, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలతో పాటు మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాలు జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇంటింటా మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని అందించాలన్నదే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పథకం అమలు చేసింది.దీంతో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాలకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయి.
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు
గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్, జగదేవ్పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 716 కి.మీ ప్రధాన పైపులైన్ వేశారు. 201ఆవాస గ్రామాలు ఉండగా పాతవి 229 ఓహెచ్ఎస్ఆర్లతో పాటు కొత్తగా 165 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించి 716.27 కిలోమీటర్ల ఇంట్రా పైపులైన్ వేసి, 53,374 నల్లా కనెక్షన్లు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట అర్బన్, రురల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలు ఉన్నాయి. 129 ఆవాస గ్రామాలు ఉండగా పాతవి 218 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉండగా కొత్తగా మరో 172 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు పూర్తి చేశారు. 494.19 కి.మీ ఇంట్రా పైపులైన్ వేశారు. 36,936 నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటిని అందిస్తున్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో 138 ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడ పాతవి 225 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉండగా మరో 131 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు పూర్తి చేసి 547.43 కి. మీ ఇంట్రా పైపులైన్ వేసి 45,245 నివాసాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 86 ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడ పాతవి 81 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉండగా కొత్తగా మరో 83 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించి 320.77 కి.మీ ఇంట్రా పైపులైన్ వేసి 27,225 నివాసాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ మండలంతో పాటు అక్కన్నపేట, కోహెడ మండలాల్లో 159 ఆవాసాలున్నాయి. ఇక్కడ పాతవి 92 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉండగా కొత్తగా మరో 117 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు లు నిర్మించి 412.23 కి.మీటర్ల ఇంట్రా పైపులైన్ వేశారు. 31,229 నివాసాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో 39 ఆవాసాలు ఉండగా వీటిలో పాతవి 44 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉండగా కొత్తగా మరో 28 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించి 149.72 కి.మీటర్ల ఇంట్రాపైప్లైన్ వేసి 9,361 నివాసాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటా శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నది బీఆర్ఎస్ సర్కారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రామాల్లో ఒక వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో ఒక వ్యక్తికి 135 లీటర్ల నీటిని అందిస్తున్నారు.
గతంలో నీళ్ల కోసం అరిగోస పడ్డం
నీళ్ల కోసం గతంలో అరిగోస పడ్డం. వ్యవసాయ బావు ల నుంచి బిందెలు, క్యాన్లతో నీళ్లు తెచ్చుకునేది. పొద్దుగాల, పొద్దువూకి నీళ్ల కోసం తిరిగేది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిపని చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది. నీళ్ల బాధ తప్పింది. పొద్దుగాల, పొద్దువూకి రెండు పూటల తాగునీళ్లు ఇంటి ముందట నల్లా ద్వారా వస్తున్నాయ్. మా గిరిజనుల దీవెనలు సీఎం కేసీఆర్కు ఉంటాయి. తండాలకు పైపులైన్ల వేసి గోదారి నీళ్లు తీసుకొచ్చి తాగిపిస్తుండు. మేము బతికినంత కాలం సీఎం కేసీఆర్ సార్కే ఓటు వేస్తాం.
-భానోత్హంస, గిరిజన మహిళ, మల్చెర్వుతండా, అక్కన్నపేట మండలం
సీఎం కేసీఆర్ గొప్ప పని చేసిండు
ఇరవై ఐదు ఏండ్ల నుంచి గ్రామ పంచాయతీలో నల్లాల ద్వారా నీళ్లు సరఫరా చేసే పని చేస్తున్నా. కానీ ఇప్పటి వరకు ఎవరూ చేయని గొప్ప పని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండు. ప్రతి ఇంటికీ గోదారి నీళ్లు తీసుకువచ్చిండు. అప్పుడు గ్రామ పంచాయతీలో నీళ్లకోసం తిప్పలు ఉండే. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా అందిస్తున్నా. నాకు చాలా సంబురంగా ఉంది.
-నాగిళ్ల సమ్మయ్య, నీటి సరాఫరా నిర్వాహకుడు, అక్కన్నపేట
గిరిజనుల పాలిట దేవుడు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల పాలిట దేవుడు. నిజంగా ఊళ్లకు దూరంగా బతికే మా తండాల్లో నేడు అన్ని వసతులు కల్పించిండు. మా పాలన మేమే చేసుకునే విధంగా ఏన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న మా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మా కలను నిజం చేసిండు. దశాబ్దాల మా కోరిక సీఎం కేసీఆర్ ద్వారా నెరవేరింది. ఇప్పుడు గిరిజన తండాల్లోనూ ప్రతి ఇంటికి ఫిల్టర్ నీళ్లు ఇస్తున్నాడు. కట్కూర్ ఊళ్లో నుంచి మా తండాకి రూ. 1.80 కోట్లతో బీటీ (డంబర్రోడ్డు) వేశారు. మా తండాలో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, తాగునీళ్లు, మరుగుదొడ్లు, బడి, ఇతరత్రా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చాలా బాగా ఉంది.
-మాలోత్ జంకి, గిరిజన మహిళ, దుబ్బాతండా, అక్కన్నపేట మండలం