చిన్నశంకరంపేట, డిసెంబర్ 1: మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని కొర్విపల్లి గిరిజన తండాకు చెందిన బానోత్ సురేశ్ ఈ నెల 29న అదే మండలంలోని చందంపేటలో తన గర్ల్ఫ్రెండ్ వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా, యువతి తండ్రి గమనించి కట్టెతో కొట్టడంతో పారిపోయాడు.
ఇంటికి, పోలీస్స్టేషన్కు వెళితే తనను కొడతారని భయంతో మూడు రోజుల నుంచి చేగుంట తూప్రాన్ మండలాల్లో సురేశ్ ఉన్నాడు. బుధవారం రాత్రి గిరిజన తండా శివారులోని పంట పొలాల్లో నిదిరించాడు. తనకోసం పోలీసులు వెతుకుతున్నారని తెలియడంతో గురువారం పోలీస్స్టేషన్ సమీపంలోకి రావడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సురేశ్ కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపణలు చేస్తూ రాస్తారోకో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, చిన్నశంకరంపేట ఎస్సై సుభాశ్గౌడ్ తదితరులున్నారు.